బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మిర్యాలగూడకు వెళ్లనున్నారు. అక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ మేరకు మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్ఎస్పీ క్యాంప్ మైదానంలో కార్యక్రమం ఉంటుందని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, పాలనలో వైఫల్యం, అన్నదాతలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేటీఆర్ ప్రసంగించనున్నారు.
రాష్ట్రంలో వర్షాలు లేక అన్నదాతలు అల్లాడుతుంటే రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని కేటీఆర్ ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడు వర్షాలు సరిగా కురవకపోవడంతో తాగు,సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.కాళేశ్వరం వద్ద లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం లేదన్నారు.నీటిని ఎత్తిపోసి రైతులకు సాగు కోసం ఇవ్వాలని ఎన్నిమార్లు బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేసినా ఈ ప్రభుత్వం మనసు కరగలేదని కేటీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే..
తన గురువు చంద్రబాబు కోసమే రేవంత్ రెడ్డి నీటిని ఎత్తిపోయడం లేదని, ఫలితంగా గోదావరి జలాలను ఏపీ సర్కార్ ఒడిసి పట్టి తమ రైతులకు నీళ్లు ఇస్తున్నదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై కేటీఆర్ నేడు రైతు మహాధర్నా కార్యక్రమంలో మాట్లాడనున్నారని తెలుస్తోంది. ప్రధానంగా రైతు సమస్యలపై గళం వినిపిస్తారని సమాచారం.
https://x.com/pulsenewsbreak/status/2095353591347483024?s=20
సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల చేయాలని డిమాండ్ చేయడంతో పాటు యూరియా కొరత, రైతు భరోసా, సాగునీరు, విద్యుత్ సమస్యలపై మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పాలన, హామీల అమలుపైనూ ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్జిషీట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.












