తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు పెద్దఎత్తున పోటెత్తారు. సర్వదర్శనానికే సుమారు 18 గంటల సమయం పడుతోందని దేవస్థానం నిన్న ప్రకటించింది.సాధారణ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్టు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. స్వామి వారి బ్రహ్మోత్సవాలు దగ్గర పడుతుండటంతో రోజురోజుకూ రద్దీ పెరుగుతోందని సమాచారం.
ఇదిలాఉండగా, శ్రీవారి వద్దకు చేరుకోవడానికి ఉపయోగించే నడక దారి మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచరిస్తున్నట్టు తెలిసింది. రాత్రి సమయంలో భక్తులు మెట్ల మార్గం గుండా వెళ్తుండగా.. ఒక్కసారిగా చిరుత కనిపించడంతో భక్తులు భయంతో పరుగులు తీసినట్టు సమాచారం. తిరుమల అలిపిరి నడకమార్గంలోని శ్రీ నరసింహస్వామి ఆలయ సమీపంలో నిన్న రాత్రి భక్తులకు చిరుతపులి కనిపించింది.
దీంతో వెంటనే అప్రమత్తమైన టీటీడీ భద్రతా, అటవీశాఖ సిబ్బంది భక్తులను సురక్షితంగా తరలించారు. కాగా, మెట్ల మార్గంలో చిరుతలు సంచరించడం ఇదేమి కొత్త కాదు. కాకపోతే ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.












