బిహార్లో భారీగా ఫేక్ సర్టిఫికేట్స్ కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం వారిని తొలిగించే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది. నకిలీ సర్టిఫికేట్లు, ఫోర్జరీ సంతకాలతో వీరంతా అక్రమంగా ఉద్యోగాలు పొందినట్టు గుర్తించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలని సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.
2006 నుంచి 2015 మధ్య కాలంలో జరిగిన టీచర్ నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ బ్యూరో సుదీర్ఘ దర్యాప్తు చేపట్టింది. అధికారులు సమర్పించిన సమగ్ర నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకుంటోంది. కేవలం ఉద్యోగాల నుంచి తొలగించడమే కాకుండా, సదరు ఉపాధ్యాయులపై చట్టపరమైన చర్యలు కూడా ఉపక్రమించింది. ఇప్పటికే ఈ స్కామ్తో సంబంధం ఉన్న పలువురిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరించారు. ఇదిలాఉండగా, అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు సాధించిఇన్నేళ్లుగా ప్రభుత్వ ఖజానా నుంచి వారు పొందిన జీతాలు, గౌరవ వేతనాలను వదిలేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఆ సొమ్మును వడ్డీతో సహా రికవరీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం.












