జమ్మూకశ్మీర్లో దాగి ఉన్న ఉగ్రవాదుల కోసం భద్రత బలగాలు పెద్దఎత్తున జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలోనే కరుడుగట్టిన ఉగ్రవాదిని హతమార్చాయి. టెర్రరిస్టుల ఏరివేతలో భాగంగా షోపియాన్ జిల్లాలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న కౌంటర్ టెర్రరిజమ్ ఆపరేషన్లో లష్కరే తోయిబా (LeT) టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతమయ్యాడు. అతడి మృతదేహాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, స్థానికంగా చెట్ల ప్రాంతాల్లో అమర్చిన నిఘా కెమెరాల్లో జాకీర్ గనాయ్తో పాటు లతీఫ్ అనే మరో ఉగ్రవాది కదలికలు తొలిసారిగా రికార్డయ్యాయి.
ఆ సమాచారంతో రంగంలోకి దిగిన భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.ఉగ్రవాదులు నక్కి ఉన్న చోటును చుట్టుముట్టి కాల్పులు జరిపాయి.ఈ కాల్పుల్లో లష్కర్ టాప్ కమాండర్ హతం అవ్వడం భారీ విజయాన్ని అందించినట్టు అయ్యింది. అయితే, మరో ఉగ్రవాది కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దట్టమైన తోటల గుండా ఉగ్రవాదులు తప్పించుకోకుండా ఉండేందుకు ఆర్మీకి చెందిన ప్రత్యేక విభాగానికి చెందిన విక్టర్ ఫోర్స్ బయటకు వెళ్లే అన్ని మార్గాలను క్లోజ్ చేసింది. రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా స్పెషల్ లైటింగ్ ఏర్పాట్లు చేశారు. త్వరలోనే మరింత మందిని ఏరివేస్తామని భద్రతా దళాల అధికారి ఒకరు తెలిపారు.












