KTR: చట్టసభల్లో సమస్యలపై చర్చించడంతో పాటు అవసరమైతే నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకే తాము సభకు వెళ్లామని చెప్పారు. రాహుల్ గాంధీ తరహాలోనే తాము అసెంబ్లీలో నిరసన చేపట్టామన్నారు. సీఎం రేవంత్ మాట్లాడినట్టుగా తాము ఎలాంటి నికృష్టమైన భాష ఉపయోగించలేదని, అన్పార్లమెంటరీ పదాలు కూడా తమ ప్రసంగంలో లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించేందుకే ఎమ్మెల్యేలంతా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు.
అసెంబ్లీ వద్ద తమ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకులని చెప్పారు. వారిద్దరూ సౌమ్యంగా వ్యవహరించే నేతలుగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అలాంటి సీనియర్ మహిళా నేతల పట్ల పోలీసుల తీరు దారుణంగా ఉందని విమర్శించారు. సబితా ఇంద్రారెడ్డి పట్ల ఓ పోలీసు దురుసుగా వ్యవహరించారని, జుట్టు పట్టుకోవడంతో పాటు గొంతు నొక్కేందుకు ప్రయత్నించారని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో రాష్ట్రం మొత్తం చూసిందన్నారు.
అదే విధంగా సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు చీర పట్టి లాగడంతో ఆమె ఇనుప కంచెలపై పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఘటనలో కోవ లక్ష్మి లేకపోయి ఉంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేదని వ్యాఖ్యానించారు. చివరకు సునీతా లక్ష్మారెడ్డి కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవం, సాధికారత గురించి కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడుతుంటే.. రాష్ట్రంలో వారి పార్టీ ప్రభుత్వం కింద మహిళా ఎమ్మెల్యేల పట్ల ఇలాంటి ఘటనలు జరగడం దారుణమన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే బాధ్యుడని కేటీఆర్ ధ్వజమెత్తారు.
''మా ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పేదాకా వదలం. హోంమంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ క్షమాపణలు చెప్పాల్సిందే. ఈ అంశాన్ని వదిలిపెట్టం. జాతీయ మహిళా కమిషన్ దగ్గరికి వెళ్తాం. సభా విలువలు, మర్యాద గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో బూతులు మాట్లాడే ఏకైక సీఎం రేవంత్ రెడ్డే. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. అసెంబ్లీని నెల రోజుల పాటు నడపాలి. ఇక అసెంబ్లీ స్పీకర్ పైనా అవిశ్వాసం పెట్టే అంశం ఆలోచిస్తాం. ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వనని స్పీకర్ అనడం ఏంటి?'' అని కేటీఆర్ మండిపడ్డారు.












