వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చేపపిండి.. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఎల్పీజీ వినియోగదారులు కూడా 25 రోజులకే సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో అమల్లో ఉన్న 45 రోజుల పరిమితికి తెరపడింది. పట్టణమైనా.. పల్లె అయినా.. ఇక నుంచి రీఫిల్ బుకింగ్కు ఒకే నిబంధన అమల్లోకి రానుంది.
కొంతకాలంగా ఎల్పీజీ వినియోగదారులు ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో డిమాండ్ పెరగడంతో అందుబాటులో ఉన్న గ్యాస్ అందరికి అందేలా చర్యలు చేపట్టిన కేంద్రం రీఫిల్ బుకింగ్పై నియంత్రణలు విధించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల వ్యవధిని, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధిని అమలు చేశారు. దీంతో అవసరం ఉన్నప్పటికీ వెంటనే సిలిండర్ బుక్ చేసుకోలేక వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఎల్పీజీ సరఫరా మెరుగుపడటంతో పాటు రీఫిల్ కోసం పెండింగ్లో ఉన్న బుకింగ్లు కూడా గణనీయంగా తగ్గినట్లు కేంద్రం చెబుతోంది.
ఈ నేపథ్యంలో దీంతో గతంలో విధించిన 45 రోజుల పరిమితిని తొలగించి.. గ్రామీణ ప్రాంతాలకూ సైతం 25 రోజులకే రీఫిల్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు ఈ నిబంధనను వెంటనే అమలైయ్యేలా చూడాలని కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపీ పేర్కొన్నారు..
మరోవైపు గతంలో సరఫరా ఒత్తిడి కారణంగా తప్పనిసరి అయిన ఆంక్షలు ఇప్పుడు సడలించడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న రీఫిల్ బుకింగ్ వ్యత్యాసం తొలగిపోనుంది. అలాగే గ్యాస్ వినియోగదారులకు ఇది ఊరటనిచ్చే అంశంగా మారనుంది.












