TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ఒక రకంగా యుద్ధం ప్రకటించి వరుసగా నిరసనల దాడి చేస్తోంది. ఒకదాని తర్వాత మరొకటి నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, వినూత్న కార్యక్రమాలతో గులాబీ పార్టీ నిత్యం ప్రజల్లో కనిపించే ప్రయత్నం చేస్తోంది. పైకి చూస్తే ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు చేస్తున్న ఆందోళనల గానే కనిపిస్తున్నాయి. అయితే దీని వెనుక మరో పెద్ద రాజకీయ లెక్క ఏమైనా ఉందా? బీజేపీకి ప్రతిపక్ష స్పేస్ దక్కకుండా చేయడమే బీఆర్ఎస్ అసలు టార్గెటా? అనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.
కాంగ్రెస్పై పోరాటం.. బీజేపీకి చెక్ పెట్టే వ్యూహమా?
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడు మరింత పెంచింది. ఆరు గ్యారంటీలు, ఎన్నికల హామీలు, రైతుల సమస్యలు, రుణమాఫీ, నిరుద్యోగం, ఆటో డ్రైవర్ల ఇబ్బందులు, 22-A భూముల అంశం ఇలా ప్రజలకు సంబంధించిన ఒక్కో సమస్యను ఎంచుకుని ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ నిరసనలు, ధర్నాలతో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పేరును హోరెత్తిస్తుంది. ధర్నాలు, ర్యాలీలు, సబ్స్టేషన్ల ముట్టడులు, వంటా-వార్పులు, ప్రజా చార్జ్షీట్, ‘బాకీ కార్డుల’ పంపిణీ వంటి కార్యక్రమాలతో పార్టీ కేడర్ను నిరంతరం యాక్టివ్గా ఉంచుతోంది గులాబీ పార్టీ. తాజాగా ఈ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నల్ల షర్టులతో నిరసనకు దిగడం, గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ అగ్రనేతల ఆందోళన, అరెస్టులు.. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టడం వంటి కార్యక్రమాలు రాష్ట్రంలో బీజేపీకి చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే కనిపిస్తోందనే అభిప్రాయాలు రాజకీయ, మేధో వర్గాల నుంచి వెలువడుతున్నాయి.
అసలు ప్రశ్న ఇక్కడే మొదలవుతోంది..
కాంగ్రెస్పై వ్యతిరేకత పెరిగినప్పుడు ఆ రాజకీయ ప్రయోజనం బీఆర్ఎస్కు దక్కాలా? లేక బీజేపీకి వెళ్లాలా? బీఆర్ఎస్ వరుస ఆందోళనలకు దిగుతున్న తీరు చూస్తే.. రెండో అవకాశానికి ఛాన్స్ ఇవ్వకూడదనే వ్యూహంతోనే గులాబీ పార్టీ ముందుకు వెళ్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
బీజేపీ బలం పెరుగుతున్న వేళ..
తెలంగాణలో బీజేపీ కూడా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన బేస్ను మరింత బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడే అసంతృప్తిని తమకు అనుకూలంగా మలుచుకోవాలని కమల దళం భావిస్తోంది. ఇదే బీఆర్ఎస్కు అసలు సవాల్గా మారుతోందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు మళ్లితే గులాబీ పార్టీ రాజకీయంగా మరింత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ‘కాంగ్రెస్పై పోరాడేది మేమే.. ప్రజల సమస్యలపై రోడ్డెక్కేది మేమే’ అనే ఇమేజ్ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోందనే టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ గత అనుభవం నుంచి పాఠం నేర్చుకుందా..
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో బీజేపీ దూకుడు ఒక దశలో బీఆర్ఎస్కు గట్టి సవాల్గా మారిందనే చర్చ అప్పట్లో గట్టిగానే వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో కమల దళం బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటాలు చేసింది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా బీజేపీ ముందుకు వెళ్లింది. బీఆర్ఎస్ పాలనా తప్పిదాలపై బీజేపీ ఆజ్యం పోస్తే.. కాంగ్రెస్ ఏకంగా నిప్పుపెట్టిందనే వాదన అప్పట్లో గట్టిగా వినిపింది. బీజేపీ కాస్త తగ్గిన వెంటనే అప్పటికే మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ బీఆర్ఎస్పై దూకుడు పెంచింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇప్పుడు మరోసారి బీజేపీ అధికార లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ తన పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో గతంలో జరిగిన పరిణామాలు మళ్లీ రిపీట్ కాకుండా చూసుకోవాలన్నదే బీఆర్ఎస్ తాజా వ్యూహమా? అని ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకుల నుంచి తలెత్తుతోన్న ప్రశ్న.
‘ప్రధాన ప్రతిపక్షం మేమే’ అనే సందేశం..
బీఆర్ఎస్ వరుస నిరసనల్లో మరో ఆసక్తికరమైన అంశం కూడా కనిపిస్తోంది. ఆ పార్టీ వారి నిరసనలను కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా.. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. రైతుల సమస్యలపై అన్నదాతలతో కలిసి ధర్నాలు.. ఆటో డ్రైవర్ల సమస్యలపై ర్యాలీలు.. భూముల సమస్యపై ఆందోళనలు.. కాంగ్రెస్ హామీలపై ప్రజా చార్జ్షీట్.. ఇలా వివిధ వర్గాలను నేరుగా టచ్ చేసే కార్యక్రమాలను చేపడుతోంది. దీని ద్వారా ఒక స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. “కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే” అనే భావనను జనాల్లో బలపరచడం ద్వారా.. బీజేపీకి ప్రతిపక్ష స్థానం దక్కకుండా చేయాలన్నది గూలాబీ దళం వ్యూహంగా ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీకి స్పేస్ ఇస్తే నష్టమేనా?
కాంగ్రెస్పై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా.. ఆ అసంతృప్తిని ఎవరు రాజకీయంగా క్యాష్ చేసుకుంటారన్నదే ఇప్పుడు రాష్ట్రంలో కీలకం మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ప్రజా వ్యతిరేకత బీజేపీ వైపు మళ్లితే.. అది బీఆర్ఎస్ పునరాగమనానికి పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉందనే కామెంట్స్ వినిస్తున్నాయి. అందుకే బీజేపీ కంటే ముందే ప్రజా సమస్యలపై గళమెత్తుతూ, నిరసనలతో ప్రజల్లో తమ ఉనికిని బలంగా చాటుకోవాలని బీఆర్ఎస్ చూస్తోందనే చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. అంటే.. బీఆర్ఎస్ చేస్తున్న ప్రతి నిరసనకు ముందు టార్గెట్ కాంగ్రెస్ అయినా.. రాజకీయంగా సెకండ్ టార్గెట్ బీజేపీనా? అన్న ప్రశ్నకు ఈ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు.
కేడర్ను కాపాడుకోవడం.. బేస్ను పెంచుకోవడం
ఎన్నికల ఓటమి తర్వాత ఏ రాజకీయ పార్టీకైనా కేడర్ను యాక్టివ్గా ఉంచడం అతిపెద్ద సవాల్. బీఆర్ఎస్ కూడా ప్రస్తుతం అదే దశలో ఉందని చెబుతున్నారు. వరుస నిరసనలు, ధర్నాలు పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉంచడంతో పాటు.. ప్రజలతో పార్టీకి ఉన్న సంబంధాన్ని తిరిగి బలోపేతం చేసే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా పరిస్థితులతో అర్థం అవుతుంది. ఇదే సమయంలో ప్రతి ప్రభుత్వ వ్యతిరేక అంశాన్ని బీజేపీ కంటే ముందే బీఆర్ఎస్ హైలైట్ చేస్తే.. ప్రజల దృష్టిలో ప్రధాన ప్రతిపక్షంగా తమ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చన్న రాజకీయ లెక్క కూడా ఉండొచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తెలంగాణలో అసలు పోటీ ముందుంది ..
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా తన స్థానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ మాత్రం అధికారంలోకి రావాలనే లక్ష్యంతో తన రాజకీయ బలాన్ని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో వచ్చే రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరాటం మాత్రమే కాదు.. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ స్పేస్ కోసం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోటీ కూడా మరింత తీవ్రం కావచ్చనే అంచనాలు ఉన్నాయి. అందుకే బీఆర్ఎస్ వరుస నిరసనలకు దిగుతున్న తీరు కేవలం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకేనా? లేక “కాంగ్రెస్పై పోరాడే ప్రధాన శక్తి మేమే.. ఆ అవకాశాన్ని బీజేపీకి ఇవ్వం” అనే రాజకీయ వ్యూహంలో భాగమా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి.. తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ రోడ్డెక్కుతోంది కాంగ్రెస్పై పోరాటం కోసమేనా? లేక కమల దళానికి ప్రతిపక్ష పాత్రకు స్పేస్ దక్కకుండా చేయడానికా? అనే ప్రశ్న రాబోయే రోజుల్లో మరింత కీలకంగా మారే అవకాశముందని రాజకీయ











