Mlc Tata Madhu: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపాయి. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల పెద్ద గొడవే జరుగుతోంది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు.
నేను స్పీకర్ ను ఒక్క మాట అనలేదు
స్పీకర్ ను నేను ఏమీ అనలేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ వ్యవస్థ పట్ల, వ్యక్తిగతంగా స్పీకర్ పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని వెల్లడించారు. స్పీకర్ ని ఉద్దేశించి తాను ఒక్క మాట కూడా అనలేదన్నారు. నేను అనని మాటలను నాకు అపాదించడం సరైంది కాదన్నారు. ''ఒకవేళ నేను అన్న మాటల్లో ఏదైనా స్పీకర్ ను ఉద్దేశించినట్లు భావిస్తే.. ఆ మాటలు నేను ఉపసంహరించుకుంటున్నా. నా మాటలపై నేను విచారం వ్యక్తం చేస్తున్నా'' అని తాతా మధు అన్నారు.
సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి
కాగా, అసెంబ్లీలోకి వెళ్లే సమయంలో తనపై దాడి చేసి, తన గొంతు నొక్కే ప్రయత్నం చేశారని తాతా మధు ఆరోపించారు. తనపై దాడి చేసిన వారిని ఉద్దేశించి మాత్రమే ఆవేశంతో అన్నానని వివరించారు. తమ పార్టీ సభ్యులపై దాడి చేసింనందుకు హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తాతా మధు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులపై దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు.
బూతులు తిట్టారు, నా ప్యాంటు లాగారు
''శాసనసభ బయట గేటు వద్ద జరిగిన సంఘటనలకు సంబంధించి నేను అనని మాటలను నాకు ఆపాదిస్తున్నారు. ఈ విషయంపై వివరణ ఇవ్వడం అవసరం అని భావిస్తున్నా. ఇవాళ మా పార్టీ మహిళా శాసనసభ్యులతో పాటు మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దాడి జరిగింది. నాపైన కూడా దాడి చేసి నా ప్యాంటు ఊడబీకేందుకు ప్రయత్నించారు. నా గొంతు నొక్కేందుకు ప్రయత్నించారు. మాటల్లో చెప్పలేని విధంగా బూతులు తిట్టారు. నా డొక్కలో పిడిగుద్దులు గుద్దుతూ దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర ఆవేదనకు గురైన నేను.. ఆ దాడి ఎవరు చేశారో, నా ప్యాంటు లాగేందుకు ఎవరు ఆదేశించారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాను. ఆ సమయంలోనూ నేను స్పీకర్ ను ఏమీ అనలేదు.
చీరలు లాగి, జట్టు పట్టుకుని
శాంతియుతంగా సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిన విషయం. మగ పోలీసులు మహిళా శాసనసభ్యుల చీరలు లాగడం, జట్టు పట్టుకోవడం, గొంతు నొక్కడం వంటి సంఘటనలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఉన్నాయి. అదే విధంగా మా సీనియర్ నాయకులు యాదవ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, హరీశ్ రావు, కేటీఆర్, డాక్టర్ సంజయ్ పైన పోలీసులు దాడి చేసి ఈడ్చుకెళ్లారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల పట్ల ఇలాంటి వ్యవహారం ఏమాత్రం ఆమోద్యయోగం కాదు.
మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై జరిగిన ఈ దాడికి బాధ్యత వహిస్తూ హోంశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. దాడికి పాల్పడ్డ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాలి. నేను మాట్లాడిన మాటలు వక్రీకరించి అసలు జరిగిన ఘటనను పక్కదారి పట్టించడమే కాకుండా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడిపై ప్రభుత్వం బాధ్యత తీసుకోని చర్యలు తీసుకోవాలని'' ఎమ్మెల్సీ తాతా మధు డిమాండ్ చేశారు.












