అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే.బ్లాక్ డ్రెస్, ప్లకార్డులు పట్టుకుని లోపలికి రాకూడదని పోలీసులు అడ్డుచెప్పడంతో బీఆర్ఎస్ శాసనసభ్యులు ఫైర్ అయ్యారు. నల్లదుస్తులు ధరించి రాకూడదని ఎవరూ చెప్పారంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సెషన్స్ ప్రారంభానికి ముందు గన్పార్క్ వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించిన విషయం తెలిసిందే.
అనంతరం వారు అసెంబ్లీ వద్దకు చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల, బీఆర్ఎస్ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. కేటీఆర్, హరీశ్ రావులను పోలీసులు అరెస్టు చేయగా..మాజీ మహిళా మంత్రుల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారు.సునీతా లక్ష్మారెడ్డి చీర లాగగా.. సబితా ఇంద్రా రెడ్డి జుట్టుపట్టు లాగి లాక్కుని వెళ్లిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://x.com/TeluguScribe/status/2096862613653381324?s=20
పోలీసుల తోపులాటలో భాగంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డ కిందపడిపోయారు. ఆయనకు స్వల్ప గాయాలు అయినట్టు తెలిసింది. అదే విధంగా ఎమ్మెల్సీ యాదిగిరి రెడ్డి కాలి బొటన వేలికి గాయమై రక్తస్రావమైంది. ఈ ఘటనలు అన్నింటి మీద మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు రక్షణ లేకుండా పోయిందని, ఇక సామాన్యుల రక్షణ సంగతేంటని ప్రశ్నించారు.
‘ప్రజాస్వామ్యంలో ఈరోజు బ్లాక్ డే.రాష్ట్ర హోంమంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని మగ పోలీసులు గొంతు నొక్కి దాడి చేశారు. పబ్లిక్గా పోలీసులు మా మహిళా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారు.ఆ రోజు దుర్యోధనుడు ప్రవర్తించినట్లు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు.సునీతా లక్ష్మారెడ్డిని పోలీసులు తోస్తే ఇనుప చువ్వల మీద పడేది.. ఆమె చేయి పట్టి లాగి మా మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మి కాపాడింది.మా సోదరి సునీతమ్మ చీర లాగిన, సబితమ్మ గొంతు నొక్కిన పోలీసులు సప్త సముద్రాలు దాటి దాక్కున్నా వదిలిపెట్టం.. మీకు తగిన గుణపాఠం చెప్తాం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.












