రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజే ప్రతిపక్షాల నిరసన కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేకుంది. నల్లదుస్తులు, ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. ఇదిలాఉండగా, శాసనసభ ప్రాంగణంలో నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. నిన్న మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఈ సందర్భంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
కేసీఆర్ లక్ష మందితో కాళేశ్వరం పాదయాత్ర చేస్తానని అంటున్నారు. అలా చేస్తే ప్రజలు నవ్వుతారని చెప్పారు.మేడిగడ్డ పియర్లు కుంగిన ప్రాజెక్టు వద్దకు కేసీఆర్ ఏ ముఖంతో వెళ్తారని ప్రశ్నించారు.రాష్ట్రంలో సాగు నీటి సమస్యకు ఎల్నినోతో పాటు కేసీఆర్ పాలనా వైఫల్యమే కారణమన్నారు. నీటి కష్టాలపై మాట్లాడే ముందు తన పదేళ్ల పాలనపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సాగునీటి రంగంపై కేసీఆర్కు సరైన అవగాహన లేదని, శాస్త్రీయ ప్రణాళిక కంటే రాజకీయ ప్రచారానికే కేసీఆర్ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. రూప.లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంలో పియర్లు ఎందుకు కుంగాయి అని అడిగారు. ప్రాజెక్టును సక్రమంగా నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం నిర్మాణ లోపాలపై నివేదికలన్నీ అందుబాటులో ఉన్నాయని, కాళేశ్వరం కోసం ఖర్చు చేసిన రూ. లక్ష కోట్లతో ఏడు ప్రాజెక్టులు పూర్తయ్యేవన్నారు.
‘ఎస్ఎల్బీసీని పూర్తి కాకుండా అడ్డుకున్నది ఎవరు? జూరాల,దిండి ప్రాజెక్టులను పదేళ్లపాటు ఎందుకు నిర్లక్ష్యం చేశారు?: సాగునీటి రంగంలో కేసీఆర్ పనితీరు సున్నా. కేసీఆర్ పాలనలో నీటిపారుదల శాఖ వ్యవస్థను నాశనం చేశారు’ అని మండిపడ్డారు.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే లక్షల ఎకరాలకు నీరందేదని, పాదయాత్ర చేయడం కంటే కేసీఆర్ ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం మంచిదని మంత్రి హితవు పలికారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భాష దిగజారడానికి కేసీఆరే కారణమని,బూతుల భాష మాట్లాడినప్పుడు కేసీఆర్ తనను తాను హీరోగా భావించారని చెప్పారు.
అదే భాషను ఆయనపై ప్రయోగిస్తే ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని, రాజకీయాల్లో బూతుల సంస్కృతికి బీజం వేసింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు.తాను ఏడు సార్లు గెలిచినా ఇలాంటి దిగజారుడు రాజకీయ భాషను చూడలేదని, రాజకీయ విమర్శలకు హద్దు, ప్రజాస్వామ్యానికి మర్యాద ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.












