అధికార కాంగ్రెస్ పార్టీలో గత మూడురోజులుగా మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.మంత్రికి తెలియకుండా దేవాదాయ శాఖపై కడియం శ్రీహరి హైదరాబాద్లో సంబంధిత ఎండోమెంట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కడియం మీద ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. మరోవైపు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేస్తూ లేఖ పంపినట్టు తెలిసింది.
దీనికితోడు నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచరులు.. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుల మధ్య వివాదం నెలకొంది.రెండ్రోజుల కిందట మందు సామేల్ అనుచరులు ఎంపీ అనుచరులపై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు గాంధీ భవన్లో కొండా సురేఖ, కడియం శ్రీహరి పంచాయితీ తేల్చేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగింది.
ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్ను మంత్రి కొండా సురేఖ కలిసి కడియం చేసిన పనుల గురించి వివరించనున్నారు. అనంతరం కడియం వివరణను సచిన్ సావంత్ కోరనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. తుంగతుర్తిలో మందుల సామేల్, చామల కిరణ్ కుమార్ రెడ్డి అంశం సద్దుమణిగించేందుకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. రేపు మందుల సామెల్, చామల కిరణ్ కుమార్ రెడ్డితో జగ్గారెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యి వివాదాన్ని సర్దుమనిగేలా చేస్తారని టాక్ వినిపిస్తోంది.












