విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్కు అకస్మాత్తుగా గుండెపోటు రాగా, తోటి కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలిపాడు. వైఎస్ఆర్ కడప జిల్లాలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ప్రయాణికులతో తిరుపతికి బయలుదేరింది. చాపాడు మండలం భద్రిపల్లి సమీపానికి చేరుకోగానే, డ్రైవర్ ఎస్.జె. బాషాకు తీవ్రమైన ఛాతీ నొప్పి మొదలైంది. ఆయన వెంటనే అప్రమత్తమై బస్సును సురక్షితంగా రోడ్డు పక్కన నిలిపివేసి, స్టీరింగ్పైనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
గమనించిన తోటి కండక్టర్ కే.ఎం.బాషా క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆయనకు సీపీఆర్ చేసి ఆ డ్రైవర్కు పునర్జన్మను ప్రసాదించింది. ఒకవైపు 108 అత్యవసర సేవలకు ఫోన్ చేస్తూనే, మరోవైపు డ్రైవర్కు గుండెపై గట్టిగా నొక్కుతూ ప్రథమ చికిత్స అందించడంతో డ్రైవర్ ఎస్.జె. బాషా ఆస్పత్రి వెళ్లే వరకు ప్రాణాలతో ఉండగలిగాడు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సరైన సమయంలో స్పందించి తోటి ఉద్యోగి ప్రాణాలు కాపాడిన కండక్టర్పై ఆర్టీసీ అధికారులు, వైద్యులు, ప్రయాణికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.












