హైదరాబాద్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఎమర్జెన్సీ ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్లమని కోరితే ఓ ఆటో డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు.నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.ఈ ఘటన పోచారం ఐటీకారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకివెళితే.. ఓ మహిళ ఉప్పల్లోని భరత్నగర్ వద్ద ప్యాసింజర్ ఆటో ఎక్కింది. ఘట్కేసర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్ను కోరగా.. సదరు డ్రైవర్ మార్గమధ్యలో భరత్నగర్లోని తాటికల్లు డిపో వద్ద ఆగి కల్లు పార్సిల్ తీసుకున్నాడు.
ఆ తర్వాత మహిళను ఘట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. మాయమాటలు చెప్పి ఆమెకు కూల్డ్రింక్లో మత్తు పదార్థం కలిపి తాగించాడు. సదరు మహిళ స్పృహ కోల్పోయిన తర్వాత ఆటోలోనే అత్యాచారానికి పాల్పడి ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్తో పాటు నగదు లాక్కుని అక్కడే వదిలేసి పరారయ్యాడు.
మహిళ స్పృహలోకి వచ్చిన అనంతరం ఎలాగోలా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్కు చేరుకుంది. అక్కడ తనకు జరిగిన దారుణాన్ని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందం, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి కేవలం 24 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రిమాండ్కు తరలించినట్టు సమాచారం.












