వర్షాకాలం వచ్చిన వర్షాలు దిక్కలేదు. జులై నెల సగం పూర్తయినా వానలు లేకపోవడంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. ఓవైపు నీళ్లులేక మరోవైపు వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నార్లు వేద్దామంటే కూడా పొలం తడపడానికి నీళ్లు లేవని వాపోతున్నారు. నీళ్లు ఇవ్వాలని సర్కారుకు మొరపెట్టుకుంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వర్షాలు లేకపోతే మేం ఏం చేయాలని అంటోంది. కాళేశ్వరం వద్ద నీరు వృథాగా పోతుందని కన్నెపల్లి వద్ద లిఫ్టింగ్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపక్షం బలంగా డిమాండ్ చేస్తున్నది. అలా చేస్తే బ్యారేజీలు కొట్టుకుపోతాయని సర్కారు చెబుతోంది. అందుకు ఎన్డీఎస్ఏ నివేదికను కారణంగా చూపుతోంది.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి విశ్రాంత ఇంజినీర్ల సంఘం లేఖ రాసింది. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయవచ్చని అందులో పేర్కొంది. ఎల్ నినో ప్రభావం ఉన్నందువల్ల పంటలు, రైతులను కాపాడటానికి కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ప్రారంభించాలని తెలిపింది. కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు సుమారు 3 టీఎంసీ వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉందని, సాంకేతిక నియమాలకు లోబడి 8.8 టీఎంసీ నీటిని లిఫ్ట్ చేసినా గ్రామాల ముంపు గానీ, ఆస్తి, ప్రాణ నష్టాలు గానీ జరగవని సీఎం రేవంత్ రెడ్డికి విశ్రాంత ఇంజినీర్లు లేఖ రాశారు.కాగా, దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.












