తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సల్కం చెరువులో ఉన్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థల భవనంపై హైకోర్టుకు రెవెన్యూ, నీటిపారుదల శాఖలు నివేదిక అందజేశాయి. అందులో ఫాతిమా కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదని అందులో పేర్కొన్నాయి.
దీంతో బండ్లగూడలోని సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఫాతిమా విద్యాసంస్థలను రక్షించేందుకు సర్కారు న్యాయస్థానానికి అందజేసిన నివేదికపై న్యాయమూర్తి ఫైర్ అయ్యారు. ‘ఒవైసీ విద్యాసంస్థల భవనం ఎఫ్టీఎల్లో లేదని ఎలా చెబుతారు? మ్యాప్స్ చూస్తుంటే ఆక్రమణ జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది కదా?, గతంలో ఉన్న ఎఫ్టీఎల్ ఇప్పుడు ఎలా తగ్గింది?’ అంటూ నిలదీశారు. మీకు నచ్చినవారి భవనాలు కూల్చకుండా వదిలేస్తారా?’ అంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తంచేశారు.
చెరువులను కాపాడుతున్నామని చెప్పుకునే హైడ్రా ఈ విషయంలో ఏం చేసింది? అని ప్రశ్నించారు.ప్రభుత్వం తమకు నచ్చిన, కావాల్సిన వారి నిర్మాణాలను కూల్చడం లేదా? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. సదరు భవనం ఎఫ్టీఎల్లో లేదని నివేదిక ఇవ్వడంతో న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ, హెచ్ఎండీలు నివేదిక ఇవ్వకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు..
ఒవైసీ భవనాలపై విధించిన స్టేటస్ కో ఉత్తర్వులను న్యాయమూర్తి తీసుకున్నారు. కాగా, ఫాతిమా కాలేజీకి జీహచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని ఇటీవల అధికారులు తెలిపారు. అలాగే విద్యాశాఖ కూడా ఆ కాలేజీకి ఎలాంటి అనుమతులు లేవని న్యాయస్థానానికి తెలిపింది.












