ప్రపంచాన్నే వణికించిన కరోనా మరోసారి కోరలు చాస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కేసులు నమోదవుతున్నాయి. కడప జిల్లాలో కొవిడ్-19 తరహా లక్షణాలతో ఇద్దరు మృతి చెందడం తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నది. జిల్లాలో ఇటీవల కొందరికి ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్షలు నిర్వహించగా..అందులో ఐదుగురికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
కడపతో పాటు రాజంపేట ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా లక్షణాలతో బాధపడుతూ చికిత్స పొందుతూ మృతిచెందారు.ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు.ప్రత్యేక వైద్యులను రంగంలోకి దించారు. కడప, రాజంపేటలో కరోనా లక్షణాలు వెలుగుచూసిన చోటల్లా స్పెషల్ టీమ్స్ పర్యటించి, మృతుల కుటుంబ సభ్యులు, ప్రైమరీ కాంటాక్టుల వివరాలను సేకరిస్తున్నారు.
ఆయా ప్రాంతాల్లో ఎవరికైనా జ్వరం, దగ్గు, శ్వాసకోస సమస్యలు ఉన్నాయా? అనే కోణంలో సర్వే చేపడుతున్నారు. మృతుల మరణానికి గల ఖచ్చితమైన కారణం కోసం బాధితుల నమూనాలను సేకరించి ఉన్నత విచారణ కోసం పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) ల్యాబ్కు పంపించారు. కాగా, తాజా మరణాలపై ఏపీ వైద్యారోగ్యశాఖ ఇంతవరకు స్పందించలేదు.












