హైదరాబాద్ మహానగరంలో ఓ మహిళ పట్ల పోలీసు హోంగార్డు అమానుషంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆమె మీద లాఠీతో దాడి చేయడంతో పాటు మాట వినడం లేదని జుట్టుపట్టుకుని కింద పడేసి ఈడ్చుకెళ్లినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఆమెను విడిచిపెట్టాలని మరో వ్యక్తి ఎంత వేడుకున్నా సదరు హోంగార్డు వినిపించుకోలేదు. దీంతో స్థానిక యువకులు కొందరు ఆ దారుణ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు. అది కాస్త క్షణాల్లోనే వైరల్ అయ్యింది.
ఒక మహిళ పట్ల తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. తెలంగాణ పోలీసులు ఇంత కాఠిన్యంగా వ్యవహరించడం పట్ల సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.రేవంత్ సర్కారులో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం కాస్త డీజీపీ సీవీ ఆనంద్ వద్దకు చేరడంతో ఆయన సీరియస్ అయ్యారు.
సదరు హోంగార్డు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వ్యక్తి అయినా డిప్యూటేషన్ మీద భారతీయ రైల్వే తరఫున పనిచేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. మహిళపై హోంగార్డు దాడి చేసిన తీరును డీజీపీ సీవీ ఆనంద్ తీవ్రంగా ఖండించారు. పరిస్థితులు ఏవైనా, మహిళపై దాడి చేసిన హోంగార్డు ప్రవర్తన క్షమించరానిదనిపేర్కొన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ నియమ నిబంధనలు అన్ని విస్మరించిన ఘటన అంటూ మండిపడ్డారు.
మహిళ పట్ల విచక్షణా రహితంగా ప్రవర్తించిన సదరు హోంగార్డును సర్వీస్ నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్కు ఆదేశాలు జారీచేశారు. స్పందించిన కమిషనర్ ఎమ్ రమేష్.. ‘హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి చేసిన హోంగార్డ్ ఆనంద్ను వెంటనే టర్మినేట్ చేయడం జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి.. అతనిని అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానంలో ఆనంద్ను హాజరుపరచి.. రిమాండ్కు తరలిస్తున్నాం ’ అని పేర్కొన్నారు.












