హైదరాబాద్లోని కొన్ని ప్రయివేట్ కాలేజీలు భారీ మోసానికి పాల్పడ్డాయి. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసి తమ కాలేజీలకు అన్ని అనుమతులు ఉన్నాయని ఇంటర్ బోర్డుకు సదరు నకిలీ అనుమతి పత్రాలను సమర్పించినట్టు తెలిసింది. ఈ వ్యవహారం కాస్త ప్రస్తుతం సంచలనంగా మారింది. హైడ్రా కమిషనర్ సహా పలువురు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీకి గురవ్వగా.. దీని వెనుక ఓ ముఠా హస్తం ఉన్నట్టు సమాచారం. ఈ తతంగం అంతా 8 ప్రముఖ ప్రైవేటు కళాశాలల ఆధ్వర్యంలో నడిచినట్టు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫైర్ సేఫ్టీ, ఇతర భద్రతా అనుమతుల కోసం ‘హైడ్రా’కు సదరు 8 కాలేజీలు ఎలాంటి దరఖాస్తులు చేయకుండానే.. ఏకంగా కమిషనర్ రంగనాథ్, పలువురు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీలు పొందినట్టు తేలింది. అనంతరం వాటిని ఇంటర్ బోర్డుకు సమర్పించి తమ కాలేజీలకు అఫిలియేషన్ పొందేందుకు యాజమాన్యాలు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే, ఎన్వోసీల పరిశీలన సమయంలో ఆ సర్టిఫికెట్లు పూర్తిగా ఫేక్ అని.. హైడ్రా కమిషనర్ సంతకం ఫోర్జరీ చేయబడిందని ‘హైడ్రా’, ఇంటర్ బోర్డు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.
దీంతో ‘హైడ్రా’ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఫోర్జరీకి పాల్పడిన మొత్తం 8 ప్రైవేటు కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైడ్రా అడిషనల్ డైరెక్టర్ ‘లేక్’ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ఆర్నగర్, మెహదీపట్నం, బర్కత్ పురాలలో ఉన్న కాలేజీల యాజమాన్యాలు ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించగా.. వారి మీద Sections 337 , 336(3), 340(2), 318(4) , r/w 3(5) నమోదు చేశారు. కాగా, మరో 60 ప్రయివేటు కాలేజీల ఎన్ఓసీలను సైతం స్క్రూటినీ చేస్తున్నట్టు హైడ్రా, ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు.
నకిలీ ధృవపత్రాలు సమర్పించిన కాలేజీలు ఇవే..
1.మెహదిపట్నంలోని ప్రియాంకా జూనియర్ కాలేజ్
2.విద్యానగర్ లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్
3.చంద్రాయన్ గుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్
4.చిక్కడపల్లిలోని న్యూ ఎరా జూనియర్ కాలేజ్
5.శివరాంపల్లిలోని షాహీర్ జూనియర్ కాలేజ్
6.తెల్లాపూర్లోని వశిష్ట జూనియర్ కాలేజ్
7.బర్కత్ పురలోని హైందవి జూనియర్ కాలేజ్
8.ఎస్సార్ నగర్ లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్
అయితే, మోసానికి పాల్పడిన హైందవి జూనియర్ కాలేజీని బీఆర్ఎస్ నాయకుడు గడ్డం శ్రీనివాస్ యాదవ్ నడుపుతున్నట్టు తేలింది.బర్కత్ పురాలోని హైందవి జూనియర్ కాలేజీ బిల్డింగ్కు నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికెట్ పెట్టి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అధికారులను మోసం చేసినట్టు గుర్తించిన హైడ్రా అడిషనల్ డైరెక్టర్ పాపయ్య వర్ల లేక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఈ మొత్తం వ్యవహారంపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.












