రాష్ట్రంలో తుమ్మిహెడ్డి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. 150 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా.. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. ఇప్పటికే సీఎం రేవంత్.. మహారాష్ట్ర సీఎంతో మాట్లాడినా ఆయన అంగీకరించడం లేదని తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలో ముంపు ఎక్కువగా ఉంటుందని, అందుకే ఫడ్నవీస్ సర్కార్ నో చెప్పినట్టు సమాచారం.
అయితే, 148 మీటర్ల ఎత్తులో నిర్మించుకునేందుకు మాత్రం ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. అలా నిర్మించడం వలన గోదావరి జలాలను సంపూర్ణంగా వినియోగించుకోలేమని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మహారాష్ట్ర సర్కారును ఒప్పించాలని రాష్ట్రంలోని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ను సీఎం కోరారు. అయినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో బుధవారం ఉదయం భేటీ అయ్యారు.
సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు.తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపునకు మహారాష్ట్రతో చర్చలకు జోక్యం చేసుకోవాలని కేంద్రమంత్రిని సీఎం రేవంత్ కోరారు. 148 మీటర్ల ఎత్తు నిర్మాణానికి గతంలోనే మహారాష్ట్ర అంగీకరించిన విషయాన్ని కేంద్ర మంత్రి పాటిల్కు దృష్టికి సీఎం రేవంత్ తీసుకెళ్లారు.
కానీ, 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించాలని కేంద్రమంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. 150 మీటర్లకు ప్రాజెక్టును పెంచినా ముంపు 1000 హెక్టార్లలోపు ఉంటుందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. అంతేకాకుండా, తుమ్మిడిహెట్టి నిర్మాణంతో ఎత్తిపోతల ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటి సరఫరాకు అవకాశం ఉంటుందని సీఎం రేవంత్.. సీఆర్ పాటిల్కు వివరించినట్టు తెలిసింది.












