రూ.3 వేల కోట్ల కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్, విశాఖపట్నంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. మొత్తం ఐదు చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ కీలక నేత మళ్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ బృందాలు మెరుపు దాడులకు దిగాయి.
బిహార్కు చెందిన ఈడీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. వైసీపీ కీలక నేత మళ్ల విజయప్రసాద్ వెల్ఫేర్ గ్రూప్ ఛైర్మన్గా ఉన్నారు. రూ.3 వేల కోట్లకు పైగా చిట్ఫండ్స్ కుంభకోణంలో భాగంగానే ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్టు సమాచారం.అయితే, వెల్ఫేర్ గ్రూప్ ఛైర్మన్గా ఆయన ఉన్నప్పుడే భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడినట్లు విజయప్రసాద్పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్, విశాఖలోని ఆయన ఇళ్లు, బంధువుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్టు తెలిసింది..
చిట్ఫండ్స్ పేరిట ఆర్థిక అవకతవకలు, డిపాజిట్ల సేకరణలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలలో నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఈ దాడులు చేస్తున్నట్టు రెండు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. డిపాజిటర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు సేకరించి, నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారని ఆయనపై ప్రధాన ఆరోపణలు ఉన్నాయి.దాదాపు రూ.3,000 కోట్ల మేర అక్రమాలను ఈడీ గుర్తించినట్టు తెలిసింది. విజయ ప్రసాద్ నివాసాలతో పాటు కంపెనీ కార్యాలయాల్లోని కీలక పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, హార్డ్డిస్క్లు, డిజిటల్ సాక్ష్యాలను అధికారులు ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనంతరం మీడియా ముందు పెట్టే ఆస్కారం ఉన్నది.












