నెల చివరికి వచ్చేసరికి అకౌంట్లో సున్నా మిగలడం.. ఎంత కష్టపడినా ‘సాలరీ డే’ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడటం.. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పటి GenZ (నేటి తరం యూత్) ఆలోచనా తీరే వేరు. డబ్బు సంపాదించడంలో నేటి యువత కొత్తదారులను అన్వేషిస్తోంది. నెల జీతం ఏం సరిపోతుందని అనుకుంటున్నారో ఏమో కానీ.. వారు వెతుకుతున్న కొత్తదారులు మాత్రం సంపదను సృష్టించడంలో హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు.
25ఏళ్ల లోపే మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్తో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటూ.. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, స్వంత బిజినెస్ అంటూ రకరకాల మార్గాల్లో డబ్బులు సంపాదించేస్తున్నారు. కేవలం ఒకే జీతంపై ఆధారపడే రోజులకు గుడ్ బై చెప్పేసి, సీనియర్ సిటిజన్లకు కూడా ఇన్స్పిరేషన్గా మారుతున్న నేటి యువత ఆర్థిక విప్లవానికి సంబంధించిన ‘క్లియర్ట్యాక్స్’ మైండ్ బ్లాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది.
ప్రముఖ ట్యాక్స్ ప్లాట్ఫామ్ 'క్లియర్ట్యాక్స్' (ClearTax) విడుదల చేసిన తాజా విశ్లేషణ ప్రకారం... 25 ఏళ్లలోపు ఉన్న పన్ను చెల్లింపుదారుల్లో ఏకంగా 76శాతం మంది ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులను (Multiple Income Sources) చూపుతున్నారు. 2022-23 అసెస్మెంట్ సంవత్సరంలో ఈ సంఖ్య కేవలం 14 శాతంగా మాత్రమే ఉండేది. ప్రస్తుతం యువత ఉద్యోగంతో పాటు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, షేర్ల లాభాలు (క్యాపిటల్ గెయిన్స్), ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, సొంతంగా వ్యాపారాలు చేస్తూ సంపద సృష్టి వైపు వేగంగా అడుగులు వేస్తున్నారు.
మరోవైపు, సీనియర్ సిటిజన్లలో కూడా 53శాతం మంది ఒక్కటికంటే ఎక్కువ ఆదాయ మార్గాలను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. దీనికితోడు దేశంలో అధిక ఆదాయం పొందే వారి సంఖ్య కూడా పుంజుకుంది. రూ.20లక్షలకు పైగా స్థూల ఆదాయాన్ని (Gross Income) ప్రకటించిన వారి వాటా 22శాతం నుంచి 32 శాతానికి పెరిగింది. భారతీయులు సంప్రదాయ పొదుపు మార్గాలను పక్కనపెట్టి పెట్టుబడులు, కన్సల్టింగ్, స్వయం ఉపాధి వైపు అడుగులు వేస్తుండటమే ఈ మార్పుకు కారణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.












