ఇండియాలో 5జీ నెట్వర్క్ విస్తరణ వేగంగా సాగుతోంది. మొన్నటివరకు 4జీ సేవలు అందుబాటులో ఉండగా ఇప్పుడు 5జీ నెట్ వాడకం వేగంగా పెరుగుతోంది. వినియోగదారులకు తక్కువ ధరకే 5జీ నెట్ సేవలు అందుబాటులోకి రావడంతో అందరూ 4జీ నుంచి 5జీకి అప్డేట్ అవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. మొబైల్, ల్యాప్ట్యాప్, టాబ్స్, స్మార్ట్ టీవీల వాడకం పెరగడంతో పాటు అంతా డిజిటల్ అయిపోయింది. విద్యాసంస్థల్లో డిజిటల్ క్లాసులు.. కంపెనీల్లో డిజిటల్ రివ్యూలు, మీటింగ్స్ నిర్వహిస్తుండటంతో వేగవంతమైన 5జీ నెట్వర్క్ కు డిమాండ్ భారీగా పెరిగింది.
ఈ క్రమంలోనే దేశంలో వేగంగా విస్తరిస్తున్న 5జీ సేవలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కీలక ప్రకటన చేశారు.‘దేశంలో 5జీ నెట్వర్క్ విస్తరణ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 50 కోట్ల మంది 5జీ సేవలను ఉపయోగిస్తున్నారు.రెండున్నర సంవత్సరాల్లోనే దేశం ఈ స్థాయికి చేరుకోవడం దేశ టెలికాం రంగానికి పెద్ద విజయం. 2030 నాటికి 100 కోట్ల మందిని 5జీతో అనుసంధానించడమే ప్రభుత్వ లక్ష్యం. 5జీ నెట్వర్క్ విస్తరణ కోసం దేశంలో సుమారు రూ.4.5 లక్షల కోట్ల పెట్టుబడులు జరిగాయి’ అని పేర్కొన్నారు.
5జీలో ప్రపంచదేశాలతో సమానంగా భారత్ దూసుకుపోతుందని, తాజాగా 6జీ టెక్నాలజీలో ప్రపంచానికే నాయకత్వం వహించడమే లక్ష్యంగా భారత్ టార్గెట్ పెట్టుకున్నట్టు సింధియా వెల్లడించారు. 'భారత్ 6జీ అలయన్స్' ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాల రూపకల్పనలో భారత్ కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. భౌతిక, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కలిపే తదుపరి తరం ఎకోసిస్టమ్ ఏర్పాటుదిశగా ఇండియా సిద్ధం అవుతోందని కేంద్రమంత్రి ప్రకటించారు.












