పార్లమెంట్లో రాజకీయ వేడి
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం
ఎరువుల నుంచి ఇంధనం వరకు...
పలు కీలక నిర్ణయాల దిశగా కేంద్రం..!
నేటి కేబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ
ఢిల్లీలో ఒక్కసారిగా హై అలర్ట్ వాతావరణం కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా కీలక సమావేశాలు నిర్వహించడం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం రాత్రి అత్యవసరంగా భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ (CCS) సమావేశాన్ని నిర్వహించిన ప్రధాని... ఇప్పుడు మరోసారి పూర్తి స్థాయి కేంద్ర క్యాబినెట్ను సమావేశపరుస్తున్నారు. వరుసగా రెండు కీలక సమావేశాలు జరగడం వెనుక అసలు కారణం ఏంటన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.
ఈసారి క్యాబినెట్ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. క్యాబినెట్ ముందు రెండు పెద్ద సవాళ్లు కనిపిస్తున్నాయి. ఒకటి... పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన. రెండోది... పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం.
పార్లమెంట్ సెషన్స్పై ఏం చేద్దాం..?
పార్లమెంట్లో ఇప్పటికే విపక్షాలు పలు అంశాలపై నిరసనలు కొనసాగిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ కీలక బిల్లుల ఆమోద ప్రక్రియపై ప్రభావం పడుతోంది. ఇటీవల ఆమోదం పొందిన జాతీయ గౌరవ నిరోధక సవరణ బిల్లు-2026, పేపర్ లీకేజీల నిరోధక బిల్లు వంటి అంశాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? విపక్షాల వ్యూహాన్ని ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాజ్యసభ సమావేశాలను ఆగస్టు 3 వరకు వాయిదా వేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే... ఈ సమావేశం కేవలం రాజకీయాలకే పరిమితం కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్న అంశం పశ్చిమాసియా సంక్షోభం. అక్కడి పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతుండటంతో ప్రపంచ సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేస్తోంది. అందుకే... రాబోయే రబీ సీజన్ను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అవసరమైతే ప్రస్తుతం ఆధారపడుతున్న దేశాలకు బదులుగా ప్రత్యామ్నాయ దేశాల నుంచి ఎరువుల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది.
ఇక ఇంధన రంగం కూడా కేంద్రానికి కీలక సవాల్గా మారింది. ముడి చమురు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాలో అంతరాయం ఏర్పడితే దేశీయ మార్కెట్పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను వేగవంతం చేయడంపై కూడా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీలో ఏం చర్చించారు..?
గురువారం రాత్రి జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో మరో కీలక అంశం చర్చకు వచ్చింది. యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయ నావికులు, ప్రవాస భారతీయుల భద్రతపై ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమీక్షించారు. వారి సురక్షిత తరలింపు, కుటుంబాలకు నిరంతర సమాచారం, అత్యవసర సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.
మొత్తానికి... ఢిల్లీలో జరుగుతున్న ఈ వరుస క్యాబినెట్ సమావేశాలు కేవలం సాధారణ పరిపాలనా కార్యక్రమాలు కావని స్పష్టమవుతోంది. ఒకవైపు పార్లమెంట్లో రాజకీయ ప్రతిష్టంభనను ఎదుర్కొనే వ్యూహం... మరోవైపు యుద్ధ ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ, ఇంధన భద్రత, వ్యవసాయ అవసరాలు, విదేశాల్లోని భారతీయుల రక్షణ వంటి కీలక అంశాలపై కేంద్రం సమాంతరంగా దృష్టి సారిస్తోంది. అందుకే ఈ క్యాబినెట్ భేటీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.












