National

ఇది Gen Z భార‌త్.. యువ‌త‌దే రాజ‌కీయ భ‌విష్య‌త్

రచన: Kashi9 నిమిషాల పఠనం

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ అనేది ప్ర‌స్తుతానికి ఓ ఉద్య‌మ పార్టీ మాత్ర‌మే. సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లైన ఈ పార్టీ జ‌నాల్లోకి రావ‌డం రావ‌డంతోనే అనూహ్య విజ‌యాన్ని అందుకుంది. మ‌రి ఈ పార్టీ పూర్తి పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుంటుందా..?

భార‌త‌దేశ చ‌రిత్ర‌లో అద్భుతం

రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి జెన్ జీ

కేంద్రాన్ని క‌దిలించిన కాక్రోచ్‌లు

Gen Z చేతుల్లోనే భార‌తదేశ రాజ‌కీయాలు

78 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో ఇదో అద్భుత ఘ‌ట్టం. భార‌తదేశ చ‌రిత్ర‌లోనే ఇదో కీల‌క మైలురాయి. మొబైల్ ఫోన్‌ల‌కు, ఇంట‌ర్నెట్‌కే ప‌రిమిత‌మ‌వుతార‌నుకున్న జెన్ జీ సాధించిన తొలి రాజ‌కీయ విజ‌యం. నీట్ పేప‌ర్ లీకులు, విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని ఉద్య‌మం మొద‌లుపెట్టింది జెన్ జీ. ఎన్ని ఆంక్ష‌లు ఎదురైనా, వాటిని అధిగ‌మిస్తూ అనుకున్న‌ది సాధించింది. రాజ‌కీయాలు, పార్టీల‌కు సంబంధం లేకుండా ఓపెన్‌గా మాట్లాడుకోవాల్సిన స‌మ‌య‌మిది. అస‌లు భార‌త జెన్ జీ కి ఈ విజయం ఎలా సాధ్య‌మైంది..? ఇక రానున్న రోజుల్లో మ‌న దేశ రాజకీయాల‌ను శాసించేది కూడా యువ‌త‌ర‌మేనా..?

హిట్ కొట్టిన కాక్రోచ్‌లు

సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ సెటైరిక్ ఉద్య‌మంగా మొద‌లైంది కాక్రోచ్ జ‌న‌తా పార్టీ. సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఓ సంద‌ర్భంలో చేసిన వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా అభిజీత్ దీప్కే అనే యువ‌కుడు సీజేపీని మొద‌లుపెట్టారు. ఈ సోష‌ల్ మీడియా పోరాటం ఈ స్థాయిలో హిట్ కొడుతుంద‌ని బ‌హుషా ఆయ‌న కూడా ఊహించి ఉండ‌రు. సీజేపీ ఎక్స్ అకౌంట్, ఇన్‌స్టాగ్రామ్, వెబ్‌సైట్.. ఇలా ఎక్క‌డ చూసినా మిలియ‌న్ల సునామీ. చ‌దువుకున్న యువ‌త వెల్లువ‌లా ఈ పార్టీలో చేరారు. దీప్కే ఢిల్లీకి రాగానే ఆయ‌న‌కు గ్రాండ్‌గా వెల్‌క‌మ్ చెప్పారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో స‌భ‌ల‌తో హోరెత్తించారు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాల తొలి రోజు హ‌స్తిన‌ను ముట్ట‌డించారు.

ఇదంతా కేవ‌లం కొద్ది రోజుల్లో జ‌రిగిన మార్పు. ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న పార్టీలు కూడా చేయ‌లేని ప‌ని చేశాయి కాక్రోచ్‌లు. మెయిన్ స్ట్రీమ్ మీడియాపై ఏ మాత్రం ఆధార‌ప‌డ‌కుండా.. చెప్పాల‌నుకుంది సూటిగా, సుత్తి లేకుండా సోష‌ల్ మీడియా ద్వారానే చెప్పారు. అందుకే యువ‌త వెల్లువ‌లా క‌దిలారు. ఎక్క‌డ నిర‌స‌న ఉన్నా... క్ష‌ణాల్లో వాలిపోయారు. దాదాపు నెల రోజులుగా ఎండ‌కు ఎండుతూ, వాన‌కు త‌డుస్తూ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద దీక్ష‌లో కూర్చున్నారు వేలాది మంది యువ‌తీ, యువ‌కులు. కేంద్రంపై అన్ని వ‌ర్గాల నుంచి ఒత్తిడి పెరిగేలా చేశారు. అంతిమంగా అనుకున్న‌ది సాధించారు. కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేశాక కానీ.. జంత‌ర్ మంత‌ర్ నుంచి క‌ద‌ల్లేదు.

జెన్ జీ చేతుల్లోనే భార‌త రాజ‌కీయాలు

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ అనేది ప్ర‌స్తుతానికి ఓ ఉద్య‌మ పార్టీ మాత్ర‌మే. సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లైన ఈ పార్టీ జ‌నాల్లోకి రావ‌డం రావ‌డంతోనే అనూహ్య విజ‌యాన్ని అందుకుంది. మ‌రి ఈ పార్టీ పూర్తి పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుంటుందా..? ఈ ప్ర‌శ్న‌కు ఇప్పుడే స‌మాధానం చెప్ప‌డం క‌ష్టం. కానీ.. రానున్న రోజుల్లో దేశ రాజ‌కీయాల్లో జెన్ జీ ప్రాధాన్య‌త పెరుగుతుంద‌ని చెప్ప‌డానికి ఎలాంటి సంకోచం కూడా అవ‌స‌రం లేదు. ఇప్ప‌టికే భార‌త రాజ‌కీయాల్లో యువ‌త‌కు ఉన్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ప్ర‌తి పొలిటిక‌ల్ పార్టీకి యువ‌జ‌న విభాగాలు ఉన్నాయి. వాటి ద్వారా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఒక‌ప్ప‌టి యువ‌తే ఇప్పుడే దేశాన్ని ఏలుతున్నారు. ఐతే యువ‌తే ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన పార్టీలు మాత్రం ఇప్పటివ‌ర‌కు లేవు. ఇక‌పై రావ‌ని మాత్రం చెప్ప‌లేం.

రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా ప్ర‌కారం కాక్రోచ్ జ‌న‌తా పార్టీ క‌చ్చితంగా పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకుంటుంది. అతి త్వ‌ర‌లోనే ఈ పార్టీ నుంచి రాజ‌కీయ ప్ర‌క‌ట‌న వ‌స్తుంది. సో.. కాల్డ్ రాజ‌కీయ పార్టీలను కాద‌ని, యువ‌త సీజేపీ వైపు చూస్తున్నారంటే.. అది భ‌ర్తీ చేయాల్సింది చాలానే ఉందని అర్థం. ఆ మ‌ద్ద‌తే సీజేపీని పూర్తి స్థాయి రాజ‌కీయ పార్టీగా మారుస్తుంది. ఐతే ఉద్య‌మాలు వేరు.. రాజ‌కీయాలు వేరు. ఉద్య‌మ పార్టీగా హిట్ కొట్టిన సీజేపీ.... రాజకీయంగా కూడా స‌క్సెస్ అవుతుందా అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రం.

రాజ‌కీయాల్లో జెన్ జీ కి స్పేస్ ఉందా..?

భార‌త రాజకీయాల్లో జెన్ జీ కి స్పేస్ ఉందా అంటే.. ఉంద‌నే చెప్పాలి. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక యువ జ‌నాభా క‌లిగిన దేశం భార‌త్. ఓ పార్టీ స‌భ స‌క్సెస్ కావాలంటే.. వారే ముందు న‌డ‌వాలి. ఓ పార్టీ గెల‌వాలంటే.. వారే ఓటేయాలి. చివ‌రికి ఓ మంత్రితో రాజీనామా చేయించాల‌న్నా వారితోనే సాధ్య‌మైంది. ఈ క్ర‌మంలో దేశంలో జెన్ జీ కి రాజ‌కీయంగా స్పేస్ క‌చ్చితంగా ఉంటుంది. కాక‌పోతే నిన్న మొన్న‌టి దాకా దీని గురించి ఎవ‌రూ పెద్ద‌గా ఆలోచించ‌లేదు. ఇక‌పై మాత్రం జెన్ జీ రాజ‌కీయాల‌ను ఎవ‌రూ ఆప‌లేరు.

ఈ పోరులో కూడా తొలి అడుగు కాక్రోచ్ జ‌న‌తా పార్టీయే వేస్తుంది. బ‌ల‌మైన కేంద్రం, అత్యంత బ‌ల‌మైన ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ. అలాంటి వాళ్ల‌నే ఎదిరించి దేశం మొత్తం ఒక్క‌టి చేశారు కాక్రోచ్‌లు. ఇదే జోరు కంటిన్యూ చేస్తూ సీజేపీ త్వ‌ర‌లోనే పూర్తిస్థాయి రాజ‌కీయ పార్టీగా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. దేశంలో సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా మూడేళ్ల స‌మ‌య‌ముంది. ఈ స‌మ‌యంలోపే ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు.

#Gen Z India#Indian politics#youth movement India#student protests#digital activism#social media politics#CJP#Dharmendra Pradhan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి