హైదరాబాద్లోని కూకట్పల్లి పరిధిలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ ఒక ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారాంతపు రోజున సరదాగా సమయాన్ని గడిపేందుకు బయలుదేరిన క్రమంలో ఈ విషాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది.
బాధితుల వివరాల్లోకి వెళితే.. మహేశ్ (17), లక్ష్మీ తేజ (17) తమ మరో మిత్రుడితో కలిసి ఒకే స్కూటీపై క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు బయలుదేరారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ సరిహద్దు ప్రాంతానికి చేరుకుంటుండగా, వెనుక భాగం నుంచి మితిమీరిన వేగంతో వచ్చిన టిప్పర్ వాహనం వీరిని ఢీకొట్టింది. తీవ్రమైన తాకిడికి ప్రమాదంలో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. కాగా ద్విచక్రవాహనంపై ఉన్న మూడో యువకుడికి తీవ్ర గాయాలవ్వడంతో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహణ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. వాహన చోదకుడి నిర్లక్ష్యమే ఈ ఘోరానికి కారణమా లేక వేగ నియంత్రణ కోల్పోవడం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారులు ఇలా హఠాత్తుగా కన్నుమూయడంతో బాధితుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.












