Taslima Nasreen: బంగ్లాదేశ్ కు చెందిన బహిష్కృత రచయిత తస్లీమా నస్రీన్ చాలా ఏళ్ల తర్వాత బెంగాల్ లో అడుగు పెట్టారు. 19 ఏళ్ల తర్వాత ఆమె బెంగాల్ తిరిగొచ్చారు. ఆగస్టు 1న కోల్ కతాలో యాంటీ ఫండమెంటలిజం లిటరరీ ప్రోగ్రామ్ జరగనుంది. ఇందులో ఆమె పాల్గొంటారు. తస్లీమా నస్రీన్ ద్విఖండి పుస్తకం తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ పుస్తకం మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తోందని ఆందోళనలు చెలరేగడంతో 2007లో ఆమె కోల్ కతాను వీడారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో మమతా ప్రభుత్వం పోయి బీజేపీ సర్కార్ అధికారంలోకి రావడంతో ఆమె మళ్లీ కోల్ కతాలో అడుగు పెట్టారు. బెంగాల్ నా ఇల్లు, తిరిగి రావడం చాల సంతోషంగా ఉందని తస్లీమా నస్రీన్ ఎమోషనల్ అయ్యారు.
పశ్చిమ బెంగాల్ రాజధాని నగరంలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నస్రీన్ దిగారు. దశాబ్దం క్రితం బంగ్లాదేశ్ నుండి పారిపోయి వచ్చిన తస్లీమా.. కోల్ కతాను తన నివాసంగా చేసుకున్నారు. అయితే, 2007లో తన ఆత్మకథకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల కారణంగా ఆమె కోల్ కతాను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందనే ఆరోపణలతో 2003లో అప్పటి సీపీఎం నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం ఆమె పుస్తకాన్ని నిషేధించింది. 63 ఏళ్ల తస్లీమా నస్రీన్ ఇప్పుడు దీర్ఘకాలిక నివాస అనుమతిపై ఢిల్లీలో నివసిస్తున్నారు.
రేపు రవీంద్ర సదన్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా జరిగే ఒక కార్యక్రమంలో నస్రీన్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, ప్రముఖ రచయిత షిర్షేందు ముఖోపాధ్యాయ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు ఇస్లాంను అవమానించారన్న ఆరోపణలను బంగ్లాదేశ్ ప్రభుత్వం నుంచి ఎదుర్కొన్న ఈ రచయిత్రి.. తన గౌరవార్థం ఏర్పాటు చేసిన పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం, తన కవితలను వినిపించడంతో పాటు ఒక చర్చా కార్యక్రమంలోనూ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
''సొంతింటికి తిరిగి వచ్చినట్లుగా ఉంది. నేను కోల్కతాను ఇష్టపూర్వకంగా ఎప్పుడూ విడిచి పెట్టలేదు. అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నన్ను రాష్ట్రం విడిచి వెళ్ళేలా బలవంతం చేసింది. అయినా, ఏదో ఒక రోజు నేను తిరిగి వస్తాననే ఆశను ఎప్పుడూ వదులుకోలేదు. ఏళ్లు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి, అయినా ఆ ద్వారం మూసే ఉండిపోయింది" అని తస్లీమా నస్రీన్ భావోద్వేగానికి లోనయ్యారు.












