విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయం 5 గంటల సమయంలో సంభవించిన ఈ భూప్రకంపనల వల్ల నగరంలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, సీతమ్మధార, మాధవధార, పెదవాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, హెచ్బీ కాలనీతో పాటు పలు ఇతర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఇళ్లలోని వస్తువులు కదలడంతో ఏం జరుగుతుందో తెలియక జనం భయంతో ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.
ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రం కాకినాడకు తూర్పున దాదాపు 225 కిలోమీటర్ల దూరంలో, బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సముద్ర గర్భంలో భూకంపం సంభవించడం వల్లే తీర ప్రాంతమైన విశాఖపట్నంలో ఈ స్థాయిలో ప్రకంపనలు వ్యక్తమయ్యాయని నిపుణులు భావిస్తున్నారు.
అయితే, ఈ ప్రకంపనల వల్ల నగరంలో ఎక్కడా ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో నగర ప్రజలు కాసేపు తీవ్ర భయాందోళనల మధ్య గడిపారు. ప్రస్తుతం పరిస్థితి అంతా ప్రశాంతంగానే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు పేర్కొన్నారు.












