ముఖానికి మాస్క్ వేసుకుని.. మీడియా కెమెరాలను తప్పించుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు పరుగెత్తిన యువకుడు..! బైక్ ఎక్కి వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయిన దృశ్యాలు తెలంగాణ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
అతడే ఎమ్మెల్సీ వెంకట్రామ్ రెడ్డి కుమారుడు భరత్ రాజ్ రెడ్డి అని ప్రచారం జరుగుతోంది. దీంతో అనేక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మంగళహాట్ ప్రాంతంలో మాదక ద్రవ్యాల వినియోగం, కొనుగోలు వ్యవహారాలపై పోలీసులు నిర్వహించిన దాడిలో భరత్ రాజ్ రెడ్డి సహా ముగ్గురు యువకులు పోలీసుల అదుపులోకి వెళ్లినట్లు సమాచారం.
వారి వద్ద నుంచి హ్యాష్ ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపినట్లు వార్తలు వెలువడ్డాయి.
మరోవైపు మాజీ కలెక్టర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి మాత్రం తన కుమారుడు డ్రగ్స్ సేవించలేదని, అతడిని అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. కేవలం విచారణలో భాగంగానే పోలీసులు సంప్రదించారని చెప్పారు. కానీ ఇక్కడే కొన్ని సందేహాలు తలెత్తుతున్నాయి. ఉదయం ఒక మాట చెప్పి.. గంటలో వెంకట్ రామ్ రెడ్డి ఎందుకు మాట మార్చినట్లు..!? అనేది మిలియన్ ప్రశ్నలా మారింది.
అదేవిధంగా భరత్ రాజ్ రెడ్డికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకపోతే.. ఆయన మంగళహాట్ పోలీస్ స్టేషన్కు ఎందుకు వెళ్లారు? పోలీసుల విచారణ జరిగిందనే విషయం వాస్తవమే అయితే.. మొదట చెప్పిన వివరాలు, తర్వాత వచ్చిన వివరణల మధ్య ఈ వ్యత్యాసం ఎందుకు కనిపిస్తోంది?
అంతేకాదు.. తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే మీడియా కెమెరాలను చూసి ముఖానికి మాస్క్ వేసుకుని ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఎందుకు అంత తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. రక్త పరీక్షల నివేదికలు, సాంకేతిక ఆధారాల వల్ల నిజాలు ఆలస్యమైన బయటికి వస్తాయి. అయితే ఈ వ్యవహారంలో నిజం ఏది? ప్రచారం ఏది? అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న కీలక అంశంగా మారింది.












