డైనోసార్ల అంతానికి గల కారణాలపై శాస్త్రవేత్తలు ఇప్పటికీ పరిశోధనలు కొనసాగిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాతో పాటు పారిస్, బ్రస్సెల్స్, వియన్నా శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో అత్యంత ఆసక్తికరమైన విషయాలను కనుగొన్నారు. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై నుంచి డైనోసార్ల అంతానికి కారణం సౌరవ్యవస్థలోని ఓ గ్రహశకలంగా గుర్తించారు.

ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ప్రముఖ 'సైన్స్ అడ్వాన్సెస్' పరిశోధనా పత్రికలో ప్రచురితమయ్యాయి. శాస్త్రవేత్తల కథనం ప్రకారం.. 6.6కోట్ల ఏళ్ల క్రితం సుమారు 10 కిలోమీటర్ల వెడల్పున్న భారీ గ్రహశకలం('కో కాండ్రైట్') అత్యంత వేగంతో వచ్చి మెక్సికోలోని యుకాటన్ తీరాన్ని ఢీకొట్టింది. ఈ తీవ్ర ఘాతానికి అక్కడ అతిపెద్ద 'చిక్సులబ్' బిలం ఏర్పడటమే కాకుండా, భూగ్రహంపై ఉన్న దాదాపు 75శాతం జీవజాతులు శాశ్వతంగా నశించిపోయాయి.

అప్పట్లో సంభవించిన ఈ మహా దాడి ఫలితంగా తీవ్రమైన భూకంపాలు, రాకాసి సునామీలు, అడవుల్లో కార్చిచ్చులు చెలరేగాయి. ఆ సమయంలో నాశనమైన రాతి పొరల్లో భద్రంగా ఉన్న నికెల్ ఐసోటోప్లను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ వినాశకార గ్రహశకలం రకాన్ని కచ్చితంగా గుర్తించగలిగారు. సాధారణంగా భావిస్తున్నట్లుగా ఆ గ్రహశకలంలో ఉన్న గంధకం (సల్ఫర్) కంటే కూడా, అది భూమిని ఢీకొట్టిన సమయంలో వాతావరణంలోకి అతి తీవ్రంగా ఎగసిపడిన దట్టమైన అతి సూక్ష్మ ధూళి కణాలే ఈ వినాశనానికి ప్రధాన కారణమని పరిశోధకులు తేల్చారు.

ఈ ధూళి, వివిధ వాయువులు కొన్నేళ్ల పాటు సూర్యకాంతి భూమిని తాకకుండా పూర్తిగా కప్పివేశాయి. దీనివల్ల వాతావరణంలో ఉష్ణోగ్రతలు పడిపోయి, కిరణజన్య సంయోగక్రియ జరగక వృక్షజాలం, దానికి ఆధారపడిన ప్రాణులు వరుసగా అంతరించిపోయాయి. తాజా పరిశోధనల ప్రకారం, భూమిపై లభించే గ్రహశకలాల అవశేషాల్లో ఈ 'CO కాండ్రైట్' రకం కేవలం 5 శాతం మాత్రమే ఉండటం విశేషం.

ఇవి గురు గ్రహం సమీపంలోని బయటి ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచి గానీ లేదా సౌర వ్యవస్థ చివరి సరిహద్దుల నుంచి గానీ భూమి వైపు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. విశ్వంలోనే అత్యంత అరుదైన, పురాతనమైన ఇలాంటి ఒక గ్రహశకలం సరిగ్గా భూమిని ఢీకొట్టడమే ఆ కాలంలో డైనోసార్ల దురదృష్టానికి నిదర్శనమని శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు.












