చిన్నారుల్లో వేగంగా వ్యాపించే తట్టు వ్యాధిపై అవగాహన కల్పించేందుకు.. చికిత్స, నివారణ మార్గాలను ప్రజలకు వివరించేందుకు హైదరాబాద్లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు.
పంజాగుట్టకు చెందిన రెస్ట్ ప్రైస్ ఆటిజం ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో.. ఆగస్టు 9న మణికొండ పంచవటి కాలనీలో ఈ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ తోడుపులూరి తెలిపారు.
వైరస్ వల్ల తట్టు వ్యాధి వస్తుందని తెలియక.. చాలామంది వైద్యులను సరైన సమయంలో సంప్రదించకుండా ఆలస్యం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం చేయించకుండా ఇతర మార్గాలను ఆశ్రయించడం వల్ల.. చిన్నారుల్లో ఈ వ్యాధి తీవ్రత పెరిగి, ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.
అందుకే తట్టు వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. తట్టు వ్యాధి నివారణ, చికిత్స పద్ధతులు, పిల్లల ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ ఉచిత శిబిరంలో నిపుణులు అవగాహన కల్పించనున్నారు.
మీ పిల్లల ఆరోగ్యం కోసం.. ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. ఆరోగ్యంపై అనుమానం ఉంటే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండని రెస్ట్ ప్రైస్ ఆటిజం ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం 91000 65552, 84335 29769 నంబర్లను సంప్రదించాలని తెలిపారు..
మరోవైపు తట్టు వ్యాధి లక్షణాలను గమనిస్తే.. మొదటగా.. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, కళ్ళు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. నోటి లోపల చిన్న చిన్న తెల్లటి మచ్చలు కూడా కనిపించే అవకాశం కొంతమందిలో ఉంటుందని వైద్యులు తెలుపుతున్నారు.
అలాగే ముఖం, చెవుల వెనుక భాగం నుంచి మొదలై.. శరీరంలోని ఇతర భాగాలకు ఎర్రటి దద్దుర్లు వ్యాపించవచ్చు. జ్వరం ఎక్కువగా ఉండటం, నీరసం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని పేర్కొంటున్నారు.. ముఖ్యంగా చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపించినప్పుడు.. వ్యాధిని తేలికగా తీసుకోకండని వైద్యులు హెచ్చరిస్తున్నారు.












