Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసిన రోజు.. 2024 ఏప్రిల్ 23 నుంచి ఎమ్మెల్యేగా దానం అనర్హులని న్యాయస్థానం పేర్కొంది. 2023లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం 2024 మార్చిలో కాంగ్రెస్లో చేరారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ బీ ఫామ్తో పోటీ చేశారనే కారణంతో దానంపై అనర్హత వేటు పడింది.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో దానం నాగేందర్ ఏ విధంగా ముందుకెళ్లనున్నారు అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. న్యాయ నిపుణులతో చర్చించాక ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. కాగా, గతంలో భూపతి రెడ్డి కూడా ఇదే తరహాలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా గత కేసులో మాదిరిగానే తీర్పు రావచ్చని కొందరు న్యాయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
దానం నాగేందర్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినా.. ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ ని సుప్రీంకోర్టు తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పిటిషన్ ను టేకప్ చేసినా.. హైకోర్టు ఆదేశాలను ఫాలో కావాలని సుప్రీంకోర్టు చెబుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేయడం దానం నాగేందర్ అనర్హత వేటుకు కారణమైంది. కాగా, అనర్హతతో ఖాళీ అయ్యే స్థానానికి 6 నెలల్లో ఉపఎన్నిక జరగాలి. అయితే హైకోర్టు తీర్పుపై అసెంబ్లీ స్పీకర్ లేదా దానం నాగేందర్ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే.. దాని ఆదేశాలపై ఉపఎన్నిక ఆధారపడి ఉంటుంది.












