సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఒక్కసారిగా అస్వస్థతకు గురైన కాంగ్రెస్ నాయకుడు ఎదుల శంకర్(34) చికిత్స పొందుతూ కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టుఇప్పపల్లి గ్రామానికి చెందిన శంకర్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడిగా కొనసాగుతున్నారు. ఈనెల 4వ తేదీన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు శంకర్ హాజరయ్యారు. అయితే, సభ జరుగుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో అక్కడున్న వారు వెంటనే ఆయనను ప్రాథమిక చికిత్స నిమిత్తం తరలించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శంకర్ తుదిశ్వాస విడిచారు. చిన్న వయసులోనే కాంగ్రెస్ పార్టీ నమ్మకమైన నాయకుడిని కోల్పోవడంతో గట్టుఇప్పపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శంకర్ మృతి పట్ల స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలిపారు.












