ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద ప్రస్తుతమున్న క్షేత్రస్థాయి పరిస్థితిని ఆయన మీడియాకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీపై ఉన్న రాజకీయ కోపంతో అసలు నీళ్లే లేవంటూ అబద్ధాలు చెప్పి రైతులను ఆగం చేయడం సరికాదని హితవు పలికారు.
కన్నెపల్లి పంప్ హౌస్లో నీటి లభ్యత పుష్కలంగా ఉందని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. సాధారణంగా అక్కడ 92 మీటర్ల వద్ద నీళ్లు ఉంటేనే లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుందని, కానీ ప్రస్తుతం ఏకంగా 102 మీటర్ల వద్ద నీరు నిల్వ ఉందో పేర్కొన్నారు. గోదావరిలో నీళ్లు లేకపోయినప్పటికీ, ప్రాణహిత నది కలిసే చోటు నుండి భారీగా వరద ప్రవాహం వస్తోందని ఆయన వివరించారు.
ప్రాణహిత నది ద్వారా ఏ కాలంలోనైనా నీటిని ఎత్తిపోసే అద్భుతమైన అవకాశం ఉంటుందనే దూరదృష్టితోనే, మాజీ సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును ఈ విధంగా డిజైన్ చేసి నిర్మించారని వేముల గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంతాలు వీడి, కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు. నీటిని లిఫ్ట్ చేసి ప్రజలకు సాగు, తాగునీరు అందించి ఆదుకోవాలని కోరారు.












