Cm Revanth: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు, తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 6న ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా స్వరాష్ట్ర సాధనకు ఆయన అందించిన విశిష్ట సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ స్వప్నాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మార్చుకుని చివరి శ్వాస వరకు ఉద్యమించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని సీఎం రేవంత్ కొనియాడారు.
తెలంగాణే ధ్యేయంగా, తెలంగాణే లక్ష్యంగా ఆ మహనీయుడు తన జీవితాన్ని అంకితం చేశారని కితాబిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను, ప్రజలు ఎదుర్కొన్న వివక్షను గణాంకాలతో సహా దేశానికి వివరించి, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాల పాటు సజీవంగా నిలిపిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కే దక్కుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, దిశానిర్దేశం చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్ తెలిపారు.












