ఆంధ్రా వాళ్ల చేతిలో తొలుబొమ్మలాట?
అప్పుడు ధరణి అంటూ కలెక్టర్ అమోయ్ కుమార్?
ఇప్పుడు భూ భారతితో మిక్కిలినేని మను చౌదరి?
టైటిల్స్తో సంబంధం లేకుండానే ఒత్తిళ్లతో పాస్ బుక్ల జారీ
అర్థం చేసుకోని ఆర్డీవో.. సీటు కాపాడుకునేందుకు ఎమ్మార్వో?
మీరు క్లియర్ చేస్తున్న భూములు ఎన్నిసార్లు అమ్మకం జరిపారో తెలుసా?
సీఐడీ కేసును పట్టించుకోకుండా పొజిషన్ లేకుండానే పట్టాలు ఇస్తారా?
60 ఎకరాలకు ఫేక్ డాక్యుమెంట్లు అయితే 800 ఎకరాలకు అంటకడతారా?
కోర్టు ఆర్డర్ లేకుండా ఎన్నిసార్లయినా ఇనాం ల్యాండ్స్కు ఓఆర్సీలు ఇస్తారా?
ఆఫీస్ రికార్డుల్లో లేని ఫైల్స్ ఉన్నట్లు.. ఉన్న ఫైల్స్ చూపించకుండానే ఏజీ ఒపీనియన్
24 గంటల్లోనే ఎమ్మార్వో నుంచి ఏజీ ఆఫీస్కు ఫైల్.. అక్కడి నుంచి కలెక్టర్కు నివేదిక
వెనువెంటనే సీసీఎల్ఏకు అనుమతుల కోసం లెటర్
భూ మాతను కూడా మింగేయాలనుకునే నాయకులకు రెవెన్యూ అధికారుల విచ్చలవిడి సహకారంపై పార్ట్ 4
స్వేచ్ఛ ఛైర్మన్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ,
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,
9848070809
ప్రచారంతోనే అంతా ఫేక్గా మార్చేసిన ముఠా?
పొజిషన్లో ఉండరు. 40 ఏండ్లుగా రెవెన్యూ రికార్డుల్లో కనిపించరు. కానీ తాము 1965లో కొనుగోలు చేసినట్లు సేల్ డీడ్స్ చూపిస్తారు. 21 మంది చేసుకున్న పార్టిషన్ డీడ్తో 1974 భూ సంస్కరణలు వచ్చేంత వరకు పేపర్స్తో మాయ చేస్తారు. భూమి గురించి లోతుగా తెలియని పవర్లో ఉన్న రాజకీయ నాయకులు, వాళ్లు చెప్పిందే గుడ్డిగా నమ్మి మొత్తానికి మొత్తం కబ్జా చేయాలని చూస్తున్నారు. బొమ్మరాసిపేట్ భూములతో తొలుబొమ్మలాట ఆడుకుంటూ 1,049 ఎకరాలను ఎలా వాడుకుంటున్నారో స్వేచ్ఛ న్యూస్ ఇన్వెస్టిగేషన్లో తేలిన ఆధారాలను మీ ముందు ఉంచుతున్నాం.
ప్రధాన ఆరోపణలు
మహ్మద్ ఇషాఖాన్ అండ్ ఇతరులు కలిసి సర్వే నెంబర్ 373, 374, 375లోని 20 ఎకరాలకు నకిలీ వ్యక్తులను పెట్టి మండవ గౌతమి కృష్ణ కుమారి పేరుతో తతంగం నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి 4 డాక్యుమెంట్లతో రామయ్య, కే వెంకట కుటుంబరావుతో పాటు మరో వ్యక్తి అమ్మకం జరిపారని సమాచారం. ఇప్పుడు బొమ్మరాసిపేట్ గ్రామంలోని 1,049 ఎకరాలను నాయకుల చుట్టూ తిరుగుతూ వారికి వందల ఎకరాల ఆశ చూపుతూ రెవెన్యూ, సీఐడీ ఇన్వెస్టిగేషన్ అధికారులపైనా ప్రెజర్ తీసుకొస్తున్నారు.
ఇందులోని అసలు వాస్తవాలు
ఇషాఖాన్ గ్యాంగ్పై 2007లో శామీర్ పేట్ పోలీస్ స్టేషన్లో కేసు(ఎఫ్ఐఆర్ నెం. 226/2007) నమోదైంది. 2008లో చార్జీషీట్ దాఖలు చేశారు. మేడ్చల్ 6వ మెట్రోపాలిటన్ కోర్టు ఈ కేసులో 2018 మే 4న తీర్పునిచ్చింది. నిందితులను నిర్దోషులుగా తేల్చింది. ఇప్పటికీ అప్పీల్కు వెళ్లలేదు. కనీసం వాళ్ల భూమి ఉందని విట్నెస్ కూడా వచ్చి క్రిమినల్ కోర్టుకు రాలేదు. 2011లో మరో ఎఫ్ఐఆర్లో బద్దం మనోహర్ రెడ్డితో పాటు ఇషాఖాన్పై గౌతమి పిర్యాదు చేశారు.
కానీ పోలీసులు వాళ్ల డ్యాకుమెంట్స్తో కేసును అప్పట్లోనే క్లోజ్ చేశారు. వీళ్లు ఫేక్ వ్యక్తులతో చేయించుకున్న డాక్యుమెంట్ (2002/2003 ఎస్ఆర్ఓ శామీర్ పేట్) క్యాన్సిలేషన్పై ఎల్బీనగర్ కోర్టులో సివిల్ సూట్(ఓఎస్ 426 ఆఫ్ 2007) పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పొజిషన్లో ఉన్న పట్టాదారులను పార్టీ చేయకుండా పాత పట్టాదారులను చేసి 4 సంవత్సరాల తర్వాత పొజిషన్లో ఉన్న పట్టాదారులను పార్టీ చేసి ఎక్స్ పార్టీ ఆర్డర్ తీసుకున్నారు.
ఈ కోర్టు విచారణలో కొన్ని 2004లో బద్దం మనోహార్ రెడ్డి పట్టాదారుడిగా, పొజిషన్లో ఉన్నా, తామే ఉన్నామంటూ పహాణీలను ఫోర్జరీ చేసి కోర్టుకు సమర్పించారు. ఈ రెవెన్యూ రికార్డుల ఫోర్జరీపై సీబీసీఐడీకి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఎక్స్ పార్టీ ఆర్డర్పై ఏఎస్ 661/2015లో ఆర్డర్ ఎగ్జిక్యూషన్పై స్టే ఇస్తూ ఇంకా పెండింగ్ లోనే కేసు కొనసాగుతోంది. ఈ పెండింగ్ కేసును దాచి పెట్టి ఓఎస్లో వచ్చిన ఆర్డర్ను చూపిస్తూ మొత్తం ఊరంతా ఇలానే జరిగిందని చెప్పుకుంటున్నారు.
కే వెంకట కుటుంబరావు బాగోతం
సర్వే నెంబర్ 375లో 5 ఎకరాలకు పైగా ఫోర్జరీ అయిందని ఆరోపణలు ఉన్నాయి. దుగ్గిరాల లీలా యుగంధర్ బాబు అనే వ్యక్తి వారసుడిని, జీపీఏ హోల్డర్ని అని చెప్పుకుంటూ 5 ఎకరాల ఫోర్జరీ పత్రాలకు రాజీ కుదిర్చాడు. ఎకరానికి రూ.15 లక్షలు (డాక్యుమెంట్ నెం. 3690/2016) తీసుకున్నారు. అయితే ఇతనికి గౌతమి కృష్ణకుమారి ఇచ్చిన అన్ రిజిస్ట్రర్ జీపీఏ(2007 జనవరి 22)ను మిస్ యూజ్ చేస్తున్నారని 2008లో రద్దు చేశారు. 2011లో లీగల్ నోటీసులతో పాటు ఈనాడులో పేపర్ ప్రకటన ఇచ్చారు.
అయినా కూడా లీలా యుగంధర్ బాబు 2016లో క్యాన్సిల్ అయిన జీపీఏ మీద రూ.80 లక్షలు డబ్బులు వసూలు చేశారు. మళ్లీ అదే కుటుంబరావు ఆస్తుల పైన దుగ్గిరాల సత్యదేవ్, మరికొంత మంది మళ్లీ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఇటీవల అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మళ్లీ యుగేంధర్కే ఆర్సీ నెంబర్స్తో అప్రూవల్ అయ్యాయి. సెటిల్మెంట్ చేస్తానని రిజిస్ట్రర్ డ్యాకుమెంట్ చేసి మళ్లీ భూములకు అప్లికేషన్ పెట్టిన ఘనుడు ఈ దుగ్గిరాల లీలా యుగంధర్ చౌదరి. అక్రమ రిజిస్ట్రేషన్స్ వల్ల సీఐడీ కేసు(ఎఫ్ఐఆర్ 541 ఆఫ్ 2020)లో ఈయన ఏ4గా ఉన్నాడు.
ఇతన్ని 2026 ఏప్రిల్ మొదటి వారంలో అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లారు. అప్పటి నుంచి ఆంధ్రా కుల రాజకీయానికి తెర లేపారు. సీఐడీ కేసులో అరెస్ట్ కావాల్సిన వాళ్ల మాయ మాటలతో 3 నెలల్లో 30 ఎకరాలకు పోజిషన్ లేకుండానే పట్టా పాస్ బుక్లు ఇష్యూ చేశారు. సీఐడీ ఒకవైపు లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తే 2026 జూలై 10న 19.31 గుంటలకు శామీర్ పేట్ ఎమ్మార్వో కోర్టు కేసు పేరుతో పాస్ బుక్ ఇష్యూ చేశారు.
రామయ్య డాక్యుమెంట్ ఫోర్జరీ
ఈయనకు చెందిన సర్వే నెంబర్ 406లో 20 గుంటలకు సంబంధించి డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేశారని కోర్టులో సివిల్ కేసు వేశారు. ఈ కేసులో రామయ్య కుటుంబం గెలుపొందింది. ఇలాగే కిషోర్ కఠారీ పైన కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉంటే క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టు నుంచి సివిల్ సూట్ ద్వారా టైటిల్ క్లైం చేసుకోవాలి. కానీ ఇప్పుడు నేరుగా పేర్లు మార్పులు చేయడం నేరపూరితమైన చర్యగా రైతులు భావిస్తున్నారు.
ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో డిక్లరేషన్ ఇదే
దుగ్గిరాల సుధీంద్రబాబు, దుగ్గిరాల విజయవాణి(భర్త పేరు సుధీంద్ర బాబు) 76 ఎకరాల వరకు విజయవాడకు చెందిన టీ సుబ్రమణ్యం, టీ హరినాథ్కు డీఫార్మ్తో అమ్మకం జరిపినట్లు, సెంటు భూమి కూడా లేదని ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1973 ప్రకారం డిక్లరేషన్(ఫైల్ నెంబర్ సీసీ/ఎం/2020/1975) ఇచ్చారు. ఈ సీసీ కాపీ ఆర్డీవో కార్యాలయంలో 2024లో లభ్యమైంది. ఇందులో 21 మంది జీపీఏ హోల్డర్ అయిన దుగ్గిరాల బలరామకృష్ణయ్య సాక్షిగా డిక్లరేషన్లో అంతా నిజమేనని కుటుంబం తరపున సంతకం చేశారు. ఈ 76 ఎకరాల పైన కూడా దుగ్గిరాల లీలా యుగంధర్ బాబు చౌదరి కోర్టు కేసు మాడ్యుల్(ఆర్సీ 2400009052)లో అప్లికేషన్ పెట్టుకున్నారు. సుధీంద్రబాబు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇలా కనిపించిన వాళ్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిజమని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు.
అప్పుడు అమోయ్ కుమార్.. ఇప్పుడు మను చౌదరి
అమోయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో 2023 సెప్టెంబర్ 7న(కేసు నెం. డీ1/126/2023 - 1) దుగ్గిరాల వారసులు 8 మంది వాళ్ల కుటుంబం పైనే కేసు వేసుకున్నారు. ఉషా మేఘన, ఎన్ సురేష్, కొడాలి శివరామకృష్ణ, టీ సుబ్రమణ్యేశ్వర్ రావు, కొండపల్లి శ్రీదేవికి కేసు విచారణతో ఆర్డర్ ఇచ్చారు. వీళ్లంతా ఆంధ్రా వాళ్లే. ఒకే కులానికి చెందిన కుటుంబ సభ్యులకు క్లియర్ చేసేందుకు విత్తనాలు నాటారు. కానీ అంతలోనే ఎలక్షన్ రావడం, అతను బదిలీ కావడం, రైతులు కూడా కోర్టుకు వెళ్లీ స్టే తెచ్చుకోవడంతో అప్పటి వరకు అంతా సద్దుమనిగింది. ఇప్పుడు మను చౌదరి మాత్రం ప్రైవేట్ భూముల్లో ఏజీ సుదర్శన్ రెడ్డి ఓపీనియన్ తీసుకుని లైన్ క్లియర్ చేశారు.
2026 ఫిబ్రవరి 7న భూభారతిలో కోర్టు మాడ్యుల్లో వచ్చిన ఈఆర్సీ లను ఏం చేయాలని ఆర్డీవో రాజేష్ కుమార్ కలెక్టర్ మను చౌదరీకి టెటర్ రాశారు. దీనిపై ఫిబ్రవరి 12న ఏజీ సుదర్శన్ రెడ్డికి ఓపీనియన్ ఇవ్వాలని నివేదిక పంపించారు. ఇందులో 2006 సంవత్సరం నుంచి ఎవరు అడిగినా తమ పరిధిలో లేదని, దొరకడం లేదని ఆర్టీఐలో సమాధానం(ఫైల్ నెంబర్ ఏ2 2183/1998, ఏ2 2138/1999) ఇస్తున్నారు. ఫైల్స్ ఆఫీస్ రికార్డ్స్లో లేవని రిప్లై ఇచ్చారు. కానీ లేని ఫైల్స్ మీద మిక్కిలినేని మను చౌదరి మాత్రం రికార్డుల్లో ఉన్నట్లుగా, ఆఫీస్ రికార్డుల్లో ఉన్న వందల ఎకరాల సీలింగ్ డిక్లరేషన్లను గురించి ప్రస్తావించకుండా ఈఆర్సీ అప్లికేషన్స్ మీద ఆంధ్రా వాళ్లకు అనుకూలమైన లీగల్ ఓపీనియన్ తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఏజీ ఓపీనియన్(నెంబర్. 49 ఆఫ్ 2026)ను ఏప్రిల్ 30న ఇచ్చారు.
ఒక్క రోజు ముందు అనగా ఏప్రిల్ 29న ఎమ్మార్వోకి మీ వద్ద ఉన్న ఫైల్స్ అన్ని ఏజీ ఆఫీస్కు తీసుకువెళ్లాలని లేఖ(లె.నెం. ఈ2/467/2026) రాశారు. ఎమ్మార్వోకి కలెక్టర్ లెటర్ రాసిన 24 గంటల్లోనే ఏజీ వద్ద నుంచి 7 పేజీల ఓపీనియన్గా వచ్చింది. అదేరోజు(ఏప్రిల్ 30) ఒపీనియన్పై సీసీఎల్ఏకు అనుమతి కోరుతూ కలెక్టర్ లెటర్ రాశారు. మే 15న ఆర్డీవోకి , తహశీల్దార్కు ఈ భూములు క్లియిర్ చేయాలని ప్రొసీడింగ్ ఇస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జూలై 10న 30 ఎకరాలకు పైగా పీపీబీలు ఇచ్చారు. జూలై 18న పొజిషన్ లేకుండానే చేతులు మారాయి. థర్డ్ పార్టీకి సేల్ డీడ్స్ అయ్యాయి.
ఈ భూములన్నింటి పైన దర్యాప్తు చేయాలని ప్రభుత్వంపై హైకోర్టులో రిట్ పిటిషన్(నెం. 17550/2021) దాఖలైంది. సాదా బైనామాలపై ఎంక్వైరీ చేసి అప్లికేషన్స్ను కన్సిడర్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో ఒక వ్యక్తి రామసహాయం సునీల్ రిట్ అప్పీల్లో కింది కోర్టుకు వెళ్లాలని డిస్మిస్ చేశారు. దీంతో మొత్తం భూములన్నింటి పైన రిట్ అప్పిల్(నెం. 489,490,491/2022) డిస్మిస్ అయినందున వాళ్లను పరిశీలనలోకి తీసుకుని క్లియర్ చేయాల్సిందిగా ఏజీ నివేదికలో పేర్కొన్నారు. తర్వాత రిట్ పిటిషన్(నెం. 14905/2022) దాఖలు చేశారు. ఇందులో భూములు కొనుగోలు చేసిన వారు తమకు తెలియకుండానే ఎస్పీఏ చేసుకుని రిజిస్ట్రేషన్కు హజరయ్యారని సీఐడీలో చాలామంది స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు.
ఇవ్వన్నీ ఉండగానే ఏజీ మాత్రం ఇంప్లిమెంట్ చేయండి అంటూ ఓపీనియన్ ఒకే రోజులో రాసి ఇవ్వడంపై అనేక అనుమానాలు తావిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ భూములు, యూఎల్సీ, ఇరిగేషన్, లావాణి, అసైన్డ్ భూముల పైనే ఏజీ నివేదికలు ఇచ్చేవారు. కానీ ఇక్కడ ప్రైవేట్ ల్యాండ్లో భూభారతి పేరుతో కోర్టు కేసులు అంటూ రూ.10 వేల కోట్ల భూ స్కాంకి పాల్పడేందుకు సిద్ధమయ్యారు. ఈ ల్యాండ్స్ విషయంలోనే ఆర్థిక లావాదేవీలు బెడిసి కొట్టడంతో మరో కేసులో ఆనాటి ఎమ్మార్వో సుచిరతను ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ తర్వాత ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో వందల కోట్లు బయటపడ్డాయి. రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా సంపాదించుకునేందుకు ఇలాంటి భూముల వివాదాలను నేరుగా క్లియర్ చేస్తున్నారు.
సీఎంవో ఆఫీస్ నుంచి సీఐడీ కేసును తవ్వొద్దని దర్యాప్తు అధికారులకు బెదిరింపుల ఫోన్స్ సైతం వెళ్తున్నాయి. స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ కథనాలతో మళ్లీ సీఐడీ దర్యాప్తు ఊపందుకుంది. సీఐడీ నుంచి ఓ ఎస్సై ఫైల్స్ ఇవ్వాలంటూ కీసర ఆర్డీవో మల్లా వెంకట్ రెడ్డిని కోరారు. ఇందుకు మల్లా వెంకట్ రెడ్డి పెద్ద తలకాయలు ఇందులో ఉన్నాయి. మీకు ఏం కాగితాలు ఇవ్వమంటారు అంటూ పొగరు బోతుగా మంత్రి అండదండలు ఉన్నాయి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ చెప్పడంతో ఆయన షాకయ్యారు. దీంతో ఈ ఆర్డీవో రోజు ఇలా ఎన్ని ఇల్లీగల్ పనులు క్లియర్ చేశారో అనే అనుమానాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
పార్ట్ 5లో మరిన్ని నిజాలు
రూ.25 కోట్ల మనీ లాండరింగ్ ఎంటి? సీఐడీ అధికారుల అప్డేట్, ఏసీబీలో నమోదైన కేసు వివరాలు, మను చౌదరి, అమోయ్ కుమార్ రెవెన్యూ అధికారులందరిపై లోకాయుక్తలో నమోదైన ఎంక్వైరీ పిటిషన్ ఏంటో పార్ట్ 5లో చూద్దాం.












