భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ శంఖారావంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రసంగం చేశారు. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టింది తమ ప్రభుత్వమేనని, నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా విజయవంతంగా ప్రారంభించి గుమ్మడికాయ కొట్టిందీ కూడా తమ ప్రభుత్వమేనని సగర్వంగా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న నిరంతర సహకారంతోనే ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయని, కేంద్ర ప్రభుత్వ అండదండలతోనే ఈ ప్రాంతంలో దాదాపు 189భారీ ప్రాజెక్టులకు పెట్టుబడులు వరదలా తరలివస్తున్నాయని వెల్లడించారు.
గడిచిన 12ఏళ్లుగా దేశాన్ని అత్యంత సమర్థవంతంగా నడిపిస్తున్న ఏకైక నాయకుడు ప్రధాని మోదీయేనని చంద్రబాబు కొనియాడారు. "నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మోదీ లాంటి విజనరీ నాయకుడిని చూడలేదు. ప్రతి విషయంలోనూ 'నేషన్ ఫస్ట్' (దేశమే ప్రథమం) అనే సిద్ధాంతంతో పనిచేసే వ్యక్తి ఆయన" అని ప్రశంసించారు. 2047నాటికి భారత్ను ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారని, డిజిటల్ ఇండియా, గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి కాలుష్య రహిత సమాజానికి పెద్దపీట వేశారని కొనియాడారు.
విశాఖ ప్రాంతాన్ని ఐటీ, తయారీ రంగానికి చిరునామాగా మార్చడంలో భోగాపురం ఎయిర్పోర్టు అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన రైతులకు పాదాభివందనం చేసిన ఆయన.. గతంలో స్థల ఎంపిక చేసిన అశోక్ గజపతిరాజుకు, గత రెండేళ్లలో పనులను పరుగులు తీగించిన ప్రస్తుత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు, నిర్మాణ భాగస్వామి జీఎంఆర్ (GMR) సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని రెండేళ్లలోనే మళ్లీ ప్రగతి పట్టాలు ఎక్కించామని, ఈ పునర్నిర్మాణంలో ఏపీకి ఆక్సిజన్ ఇచ్చి కాపాడిన ఏకైక వ్యక్తి మోదీయేనని స్పష్టం చేశారు.
అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ సాధనతో పాటు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడటంలో ప్రధాని పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. వచ్చే 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే ఘనంగా ప్రారంభిస్తామని సభాముఖంగా చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల నెరవేరిన ఈ శుభసమయంలో ప్రధాని నాయకత్వంలో ఏపీ మరింత వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు.












