లడఖ్ పర్యావరణ పరిరక్షణ, ఆ ప్రాంత స్వయంప్రతిపత్తి కోసం సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన ఉద్యమానికి ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖుల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. సమాజంలో జరుగుతున్న పలు పరిణామాలపై పౌరుల మౌనం అత్యంత ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా స్పందిస్తూ నోరు విప్పాలని ప్రముఖ సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి పిలుపునిచ్చారు. లడఖ్ రాజ్యాంగ హక్కులతో పాటు పర్యావరణ పరిరక్షణ కోసం అమరణ పోరాటం చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్కు ఆమె పూర్తి మద్దతు ప్రకటించారు.
'మనకెందుకులే' అని నిర్లక్ష్యంగా దాటుకెళ్లే మనస్తత్వాన్ని వీడి, ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ సందేశాన్ని ఓ సందేశాన్ని సుదీర్ఘంగా రాసుకొచ్చారు. దేశంలో ఎలాంటి విపత్తులు లేదా సమస్యలు వచ్చినా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే తీవ్ర విఘాతమని మంచు లక్ష్మి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అందరూ రోడ్లపైకి రావాల్సిన పనిలేదని తెలిపారు.
కనీసం సోషల్ మీడియా ద్వారానైనా తమ గొంతును బలంగా వినిపించడం, నిరంతరం జరుగుతున్న విషయాలపై అవగాహన పెంచుకోవడం పౌరులుగా మన కనీస బాధ్యత అని గుర్తుచేశారు. నిస్వార్థంగా సమాజం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం పోరాడుతున్న వాంగ్చుక్ వంటి పోరాటయోధులకు దేశ ప్రజలంతా ఏకతాటిపై నిలబడి అండగా ఉండాలని ఆమె కోరారు. మరోవైపు కేవలం రాజకీయ నాయకులను వేలెత్తి చూపుతూ విమర్శించడంతో మన బాధ్యత తీరిపోదని, దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతీ పౌరుడు కార్యోన్ముఖుడు కావాలని సూచించారు.
మన కళ్లముందే చుట్టూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి పౌరుల భాగస్వామ్యమే అత్యంత కీలకమని ఈ సందర్భంగా మంచులక్ష్మి భావోద్వేగంతో రాసుకొచ్చారు. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సాధారణంగా రాజకీయ, సామాజిక వివాదాస్పద అంశాలపై స్పందించడానికి సంకోచిస్తుంటారు. అయితే, మంచు లక్ష్మి ధైర్యంగా ముందుకు వచ్చి బహిరంగంగా తన మద్దతును తెలపడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సమాజం పట్ల ఆమె చూపిన స్పందనను, పౌర బాధ్యతను పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.












