డిజిటల్ వేదికలపై అశ్లీల కంటెంట్ ప్రసారం, చట్టాల ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. గత రెండేళ్ల వ్యవధిలో నిబంధనలు ఉల్లంఘించిన 50 ఓటీటీ (OTT) వేదికల యాక్సెస్ను భారత్లో పూర్తిగా బ్లాక్ చేసినట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో వెల్లడించారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 67, 67ఏ తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 294, మహిళల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టాలలోని నిబంధనలను పదేపదే ఉల్లంఘించినందుకే ఈ వేదికలపై నిషేధం విధించినట్లు స్పష్టం చేశారు.
అభ్యంతరకర కంటెంట్ను అరికట్టేందుకు డిజిటల్, సోషల్ మీడియా వేదికలకు ప్రభుత్వం కొత్త గడువులను నిర్దేశించింది. కోర్టు ఉత్తర్వులు లేదా ప్రభుత్వ అధికారిక ఆదేశాలు అందిన మూడు గంటల్లోపే సదరు చట్టవిరుద్ధ కంటెంట్ను ప్లాట్ఫారమ్ల నుంచి పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. ఈ సమయపరిమితిని పాటించని సంస్థలపై తీవ్రస్థాయిలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. నెటిజన్లకు, ముఖ్యంగా చిన్నారులకు సురక్షితమైన, బాధ్యతాయుతమైన డిజిటల్ వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టాన్ని బలోపేతం చేస్తున్నట్లు సమాచార ప్రసార శాఖ తెలిపింది.
మరోవైపు యువతలో పెరుగుతున్న డిజిటల్ వ్యసనంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక సర్వే (Economic Survey) 2025-26 నివేదిక ప్రకారం.. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఆన్లైన్ గేమింగ్, సోషల్ మీడియా అతిగా వాడటం అనేది ఒక తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారిందని గుర్తుచేసింది. దీనివల్ల కలిగే మానసిక, ఆర్థిక నష్టాలను నివారించేందుకు కఠిన చట్టాలను అమలు చేయడంతో పాటు, సీబీఎస్ఈ, ఎన్సీఈఆర్టీల సహకారంతో పాఠశాల స్థాయి నుంచే బాధ్యతాయుత డిజిటల్ వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపింది.
సైబర్ భద్రత, డిజిటల్ రక్షణపై దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు నిర్వహింంచిన 6,650 శిక్షణ శిబిరాల ద్వారా దాదాపు 11.37 లక్షల మందికి అవగాహన కల్పించారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా పోస్టర్లు, వీడియోలు, కార్టూన్ కథల రూపంలో సైబర్ రక్షణ పాఠాలను అందుబాటులోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. డిజిటల్ మీడియా ప్రచురణకర్తలు, ఓటీటీ సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను సైతం అందుబాటులోకి తెచ్చింది.












