పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. విపక్షాలు అనుకున్నవిధంగానే అటు సభ ప్రారంభం అవ్వగానే నిరసనలు, ఆందోళనలు షురూ చేశాయి. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థుల భవిష్యత్ కోసం చర్చ పెట్టాలని డిమాండ్ చేశాయి. మరోవైపు అయోధ్య విరాళాల చోరీ మీద కూడా చర్చ జరపాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి.
ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంటు వెలుపల జంతర్మంతర్ వద్ద సీజేపీ నేతలు, నిరసనకారులు ఆందోళనలు కొనసాగిస్తుండగా.. లోక్సభ రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలు నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చకు పట్టుబడుతున్నారు. దీంతో మోడీ సర్కార్ నీట్ పేపర్ లీక్ ఘటనపై స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. లోక్సభలో పేపర్ లీక్ అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రకటించింది.
ఇదిలాఉండగా, ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టడం గందరగోళానికి తెరలేపింది.దీంతో లోక్ సభ మధ్యాహ్నం 2 రెండు గంటలకు వాయిదా పడింది. ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో మాట్లాడుతూ..నీట్ పేపర్ లీక్పై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మూడు రోజులుగా చెబుతున్నామని పేర్కొన్నారు. చర్చలు నిబంధనల ప్రకారమే జరగాలని సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుంచే చెబుతున్నామని గుర్తుచేశారు.చర్చ ఎప్పుడు జరగాలి? ఎంతసేపు జరగాలి? ఏ నిబంధనల ప్రకారం జరగాలి? అనే విషయాలను అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడిన తర్వాతే నిర్ణయిస్తామని తెలిపారు.












