ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న మెటా.. ఇటీవలి కాలంలో భారతీయ చట్టాలను విస్మరించి కొన్ని అనైతిక యాడ్స్ ప్రమోషన్ చేస్తున్నట్టు తాజాగా తేలింది.బీబీసీకి చెందిన ఒకరు ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మెటా సంస్థపై కేంద్రం సీరీయస్ అయ్యింది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఐటీ మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు సైతం జారీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
అసలు విషయానికొస్తే.. మెటాలో కీలకంగా మారిన ఇన్ స్టాగ్రామ్ సోషల్ మీడియా సేవలు అందిస్తున్నది. ఎంటర్టైన్మెంట్, యాడ్ ప్రమోషన్ ద్వారా అటు సంస్థ, ఇటు ఇన్ ఫ్లుయెన్సర్స్ లక్షలు సంపాదిస్తున్నారు. ఈ మధ్యకాలంలో అసభ్యకర, అభ్యంతరకర ప్రకటనలు, కంటెంట్ పెద్దఎత్తున డంప్ అవుతున్నది. చిన్నారులపై లైంగిక వేధింపులను ప్రోత్సహించేలా ఉన్న కంటెంట్ ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రూపంలో వస్తున్నది. దీనిని ప్రమోట్ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
ఇలాంటి అభ్యంతరకరమైన ప్రకటనలను ఎలా అనుమతిస్తున్నారో వెంటనే వివరణ ఇవ్వాలని కోరుతూ ‘మెటా’కు నోటీసులు పంపేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ సిద్ధమవుతోంది.ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి నుంచి సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం. కాగా, ఇటీవల వాట్సాప్ యూజర్ నేమ్ విషయంలో నెలకొన్న సందేహాలపైనా మెటాకు కేంద్రం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.












