ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ మొదటికే వచ్చింది. రెండు వారాల పాటు కొనసాగిన సీజ్ఫైర్ .. హార్మూజ్లోని నౌకలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో మళ్లీ ముదిరింది.ఆ మరుసటి రోజే అమెరికా.. ఇరాన్లోని కీలక ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. నాటి నుంచి ఇరుదేశాల నడుమ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇకపోతే ఓవైపు శాంతి చర్చలకు సిద్ధం అంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబుల మోత మోగిస్తున్నారు.
ఈ క్రమంలోనే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మళ్లీ మూసివేసింది. దీంతో అమెరికా బందర్ అబ్బాస్, ఖేస్మ్ ఐలాండ్, సిరిక్ లాంటి ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది. ఇరాన్ న్యూస్ ఏజెన్సీలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. అమెరికా దాడుల నేపథ్యంలో.. గల్ఫ్ కంట్రీస్లోని యూఎస్ బేస్ల మీద దాడులకు ఇరాన్ సన్నాహాలు చేస్తున్నది.అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని .. ఇజ్రాయెల్ ఓ నివేదికను యూఎస్కు అందజేసినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ట్రంప్.. ఇరాన్కు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు.ఇరాన్ అలాంటి సాహసానికి ఒడిగడితే ఆ దేశం సర్వనాశనం అవ్వడం ఖాయమని హెచ్చరించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ లక్ష్యంగా 1000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయని..వాటి వెనుకే మరో వేలాది క్షిపణులు దూసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించారు. ఇరాన్లోని అన్ని ప్రాంతాలను పూర్తిగా నాశనం చేస్తామని.. తన ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ రాసుకొచ్చారు.కాగా,తన తండ్రి అలీఖమేని హత్యకు తప్పక ప్రతీకారం తీర్చుకుంటామని మొజ్తాబా ఖమేనీ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా, హోర్ముజ్ జలసంధి మళ్లీ మూసివేయడంతో ఇండియాలో మరోసారి చమురు, ఎల్పీజీ సమస్యలు ఉత్పన్నం కానున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి.గ్యాస్ ధరలు సైతం పెరిగాయి.ఇటీవల చమురు, గ్యాస్ సరఫరా మీద విధించిన ఆంక్షలను కేంద్రం తొలగించగా.. మరోసారి విధించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.












