దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులందరూ తమ డ్రైవింగ్ లైసెన్స్కు (DL) మొబైల్ నంబర్ను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలని కేంద్ర రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే సెప్టెంబరు 25నాటికి ఈ అప్డేట్ ప్రక్రియను పూర్తిచేయాలని రవాణా శాఖ అధికారులు తుది గడువు విధించారు. ఒకవేళ నిర్దేశిత గడువులోగా మొబైల్ నంబర్ను అనుసంధానించకపోతే సంబంధిత డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేస్తామని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
వాహనదారులు ఆర్టీవో (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ విధానంలో ఉచితంగా ఈ సేవలను పొందే అవకాశం కల్పించారు. కేంద్ర ప్రభుత్వ అధికారిక 'సారథి పరివాహన్' (sarathi.parivahan.gov.in) పోర్టల్లోకి వెళ్లి తమ రాష్ట్రం, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి, కొత్త మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా సులభంగా అప్డేట్ చేసుకోవచ్చని సూచించారు.
పాత డ్రైవింగ్ లైసెన్స్లలో మొబైల్ నంబర్లు లేకపోవడం, కొన్నింటిలో పని చేయని నంబర్లు ఉండటం వల్ల డిజిటల్ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఈ-చలాన్లు, వాహన నవీకరణ నోటిఫికేషన్లు, ఆర్టీవో సమాచారం సకాలంలో వాహనదారులకు చేరవేయడానికి యాక్టివ్ మొబైల్ నంబర్ అత్యంత కీలకమని స్పష్టం చేశారు. తనిఖీల సమయంలో నంబర్లు లభించక ట్రాఫిక్ పోలీసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ-చలాన్ల చెల్లింపులు, వాహన సమాచార బదిలీ, ఇతర పారదర్శక రవాణా సేవలు వేగవంతంగా అందాలంటే సెప్టెంబరు 25లోపు మొబైల్ నంబర్ అనుసంధానం పూర్తి చేయాలని రవాణా శాఖ కోరింది. నిర్లక్ష్యం వహిస్తే లైసెన్స్ రద్దై భవిష్యత్తులో వాహనాలు నడిపే క్రమంలో తీవ్ర చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. కాబట్టి వాహనదారులంతా తక్షణమే సారథి పోర్టల్లో తమ వివరాలను నవీకరించుకోవాలని విజ్ఞప్తి చేసింది.












