Sonam Wangchuk: యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్ చుక్ తగ్గేదేలే అంటున్నారు. నిరాహార దీక్షపై కీలక ప్రకటన చేశారు. తన నిరాహార దీక్ష కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. వాంగ్ చుక్ ఇప్పుడు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో ఉన్నారు. ఆయన దీక్ష 23వ రోజుకి చేరింది. శాంతియుతంగా పార్లమెంటుకు బయలుదేరిన సీజేపీ నాయకులు, మద్దతుదారులు, యువతను పోలీసులు దారుణంగా కొట్టడం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు వాంగ్ చుక్. వారిని పార్లమెంటులో ఎంపీలను కలవనిచ్చే వరకు లేదా ఎంపీలే తానుంటున్న ఆసుపత్రికి వచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు.
''NEET-UG పేపర్ లీక్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నాయకులను పార్లమెంటు సభ్యులు (MPలు) కలిసేందుకు అనుమతించే వరకు లేదా ఆ ఎంపీలే స్వయంగా తాను చికిత్స పొందుతున్న ఢిల్లీ ఆసుపత్రికి వచ్చి కలిసే వరకు నా నిరాహార దీక్షను కొనసాగిస్తాను'' అని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చెప్పారు.
NEET-UG పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన CJP నిరసనకారులపై ప్రభుత్వం ప్రదర్శించిన "క్రూరత్వం"పై వాంగ్చుక్ సోషల్ మీడియా వేదిక 'X'లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను నా నిరాహార దీక్షను (23వ రోజు) కొనసాగిస్తాను. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువత పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరులోని క్రూరత్వాన్ని చూశాక, యువ నాయకులను పార్లమెంటులో ఎంపీలను కలవడానికి అనుమతించే వరకు లేదా నన్ను ఇక్కడ ఆసుపత్రిలోనే వారిని కలవడానికి అనుమతించే వరకు నా దీక్షను కొనసాగించాలని నిర్ణయించుకున్నాను" అని లేఖలో పేర్కొన్నారు వాంగ్ చుక్.
"అంతకంటే ముందే ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి బాధ్యతను ఖరారు చేస్తుందని ఆశిస్తున్నా. రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నప్పటికీ యువత శాంతియుతంగా వ్యవహరించిన తీరు నన్ను ఎంతగానో కదిలించింది. విద్యార్థులు తమ సమస్యలను పార్లమెంటు ముందు వివరించేందుకు ఈరోజు లేదా రేపు అనుమతించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించాలని నేను ప్రభుత్వం, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా" అని వాంగ్ చుక్ చెప్పారు. "యువ నిరసనకారులు ఈరోజు చూపిన ఓర్పు, సహనం రేపు కూడా ప్రదర్శిస్తారని" సోనమ్ వాంగ్ చుక్ ఆశాభావం వ్యక్తం చేశారు.












