రాష్ట్రంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లోని పలు విభాగాల్లో పనిచేస్తూ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించుకున్నట్టు ఆరోపణలు వచ్చిన వారి మీద, వారి బంధువులు, బినామీల ఇళ్లల్లోనూ వరుస దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రభుత్వ అధికారిపై ఏసీ కొరడా ఝలిపించినట్టు సమాచారం.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించినట్టు సమాచారం. గురువారం తెల్లవారు జామున ఆయన ఇళ్లు,బంధువులు, బినామీల ఇండ్లపై దాడులు జరిపినట్టు తెలుస్తోంది.ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఈ తనిఖీల్లో పెద్దమొత్తంలో అక్రమాస్తులను గుర్తించినట్టు తెలుస్తోంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.వందల కోట్లు ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఏసీబీ అధికారుల దాడులతో అదే శాఖలో పనిచేస్తున్న అధికారులు సైతం కంగుతున్నట్టు తెలుస్తోంది.గత కొంతకాలంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ ఏడీ జయరాజ్ కదలికలపై నిఘా ఉంచిన ఏసీబీ.. విశ్వసనీయ సమాచారం మేరకు ఇవాళ తెల్లవారుజామున దాడులు నిర్వహించినట్టు తెలిసింది.
ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.అతని బంధువులు, బినామీ ఇండ్లల్లోనూ కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అక్రమ ఆస్తుల విలువను లెక్కిస్తున్నట్టు సమాచారం. మైన్స్ ఏడీ జయరాజు ఇంట్లో నగదు, బంగారం, ప్లాట్లు, వ్యవసాయ భూములకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకుని వాటి వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం. కాగా, ఈ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరికొద్దిసేపట్లో ఏసీబీ అధికారులు మీడియాకు వివరాలు వెల్లడిస్తారని సమాచారం.












