National

నేపాల్ ఆకస్మిక వరదలకు కారణం అదే.. ముంచుకొస్తున్న మరో ప్రళయం!

రచన: Mamatha puppala6 నిమిషాల పఠనం

నేపాల్‌లో సంభవించిన బీభత్సమైన ఆకస్మిక వరదలకు భూకంపం కారణం కాదని 'అమెరికా భూగర్భ సర్వే సంస్థ' (USGS) స్పష్టం చేసింది. నేపాల్-చైనా సరిహద్దుల్లో భారీ హిమనదం (Glacial collapse) ఒక్కసారిగా కూలిపోవడమే ఈ విపత్తుకు ప్రధాన కారణమని వెల్లడించింది.

నేపాల్‌లో సంభవించిన బీభత్సమైన ఆకస్మిక వరదలకు భూకంపం కారణం కాదని 'అమెరికా భూగర్భ సర్వే సంస్థ' (USGS) స్పష్టం చేసింది. నేపాల్-చైనా సరిహద్దుల్లో భారీ హిమనదం (Glacial collapse) ఒక్కసారిగా కూలిపోవడమే ఈ విపత్తుకు ప్రధాన కారణమని వెల్లడించింది. తొలుత ఉదయం 8:37 గంటలకు 4.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ప్రచారం జరిగినప్పటికీ, ఉపగ్రహ చిత్రాలు, ప్రకంపనల ఆధారాలను విశ్లేషించిన తర్వాత అక్కడ ఎలాంటి భూకంపం రాలేదని, మంచు-రాళ్లతో కూడిన కొండచరియలు విరిగిపడటం వల్లే ఆ తీవ్రత నమోదైందని యూఎస్‌జీఎస్ తేల్చిచెప్పింది.

ఈ హిమనదం కూలిపోవడంతో రసువాగఢి సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలోని లెండే నదిలో ఒక్కసారిగా బురద ప్రవాహం, వరద పోటెత్తింది. ఈ ఊహించని విపత్తు కారణంగా నేపాల్‌లో ఇప్పటివరకు 157మృతదేహాలను పోలీసులు వెలికితీయగా, వందలాది మంది గల్లంతయ్యారు. తప్పిపోయిన వారిలో 142 మంది భారతీయ యాత్రికులు (కైలాస మానససరోవర్/గోసైకుండ యాత్రికులు) ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. రసువా, ధాదింగ్, నువాకోట్ జిల్లాల్లో గ్రామాలు బురదమయమై విద్యుత్, రవాణా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. టిబెట్ (చైనా) వైపు కూడా ముగ్గురు మరణించగా 265 మంది ఆచూకీ దొరకలేదని అక్కడి మీడియా పేర్కొంది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ఆర్మీ హెలికాప్టర్లతో సహాయక చర్యలను వేగవంతం చేసింది. బాధితులను కాపాడేందుకు అన్ని ప్రభుత్వ వనరులను ఉపయోగిస్తున్నామని నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ప్రకటించారు. ఈ విపత్తు నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేపాల్ ప్రధానితో మాట్లాడి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహా అన్ని రకాల మానవతా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

నేపాల్‌కు ముంచుకొస్తున్న మరో హిమ ప్రళయం

ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల విపత్తు నుంచి కోలుకోకముందే నేపాల్‌ను మరో మహా ముప్పు భయపెడుతోంది. హిమాలయాల్లో మంచు వేగంగా కరిగిపోతుండటంతో దేశంలోని ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలకు తీవ్ర ముప్పు కలిగించే 47 హిమనద సరస్సులను (Glacial Lakes) అత్యంత ప్రమాదకరమైనవిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సరస్సుల సహజ కట్టలు తెగితే ‘గ్లేషియల్ లేక్ అవుట్‌బర్స్ట్ ఫ్లడ్’ (GLOF) సంభవించి, కంటిరెప్పపాటులో నదీ లోయల్లోని గ్రామాలు, పట్టణాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ICIMOD) , నేపాల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ విపత్తు జాబితాలోని 47 సరస్సుల్లో 21 నేపాల్ భూభాగంలో ఉండగా, మిగిలిన 25 టిబెట్ (చైనా) పరిధిలో ఉన్నాయి. టిబెట్‌లోని సరస్సులు నేపాల్‌ వైపు పారే ప్రధాన నదుల ఎగువన ఉండటంతో, సరిహద్దు దాటి వచ్చి ధ్వంసం చేసే అవకాశం ఉమ్మడి ముప్పుగా మారింది. వీటిలో ముఖ్యంగా లోయర్ బరున్ (తల్లోపొఖరి), తులాగి, లుమ్డింగ్ షో, హోంగు-2, షో రోల్పా, ఇమ్జా షో వంటి 6 సరస్సులను ‘అత్యంత ప్రమాదకర’ కేటగిరీలో చేర్చారు. వీటిలో నీటి ఒత్తిడిని తగ్గించేందుకు నిపుణులు తక్షణ చర్యలు సూచిస్తున్నారు. ఈ ప్రమాదంలో కోసి, భాగమతి నదీ పరీవాహక ప్రాంతాలు 85 శాతానికి పైగా ప్రమాదంలో ఉన్నాయి. సోలుఖుంబు, సంకువాసభ, దోలఖా, సింధుపాల్‌చౌక్ జిల్లాలు నేరుగా విధ్వంసానికి గురయ్యే అవకాశాలున్నాయి.

అదే సమయంలో పశ్చిమ నేపాల్‌లోని గండకి, కర్ణాలి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న మనాంగ్, గోర్ఖా, ముస్తాంగ్ వంటి జిల్లాల్లోని మానవ నివాసాలతో పాటు బిలియన్ డాలర్ల విలువైన జలవిద్యుత్ ప్రాజెక్టుల ఉనికి ప్రమాదంలో పడింది. ఈ హిమనద సరస్సులు పొంగిపొర్లితే నేపాల్‌తో పాటు దిగువన ఉన్న భారత్‌లోని బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు సరిహద్దు నదుల నీటిమట్టాలపై తీవ్ర నిఘా ఉంచాయి. హిమాలయ ప్రాంతంలో పర్యావరణ మార్పులపై తక్షణమే అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర నివారణ చర్యలు తీసుకోకపోతే ఊహించని నష్టం తప్పదని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.

#NepalFlooding#GLOF#GlacialLakes Threat#ICIMOD#NepalDisaster#HimalayanGlaciers#NepalFloods#GlacialCollapse#USGS#BhotekoshiFlood#IndiaNepalRelief#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి