కులగణనపై కాంగ్రెస్ ప్రశ్నలు
OBC లెక్క తెలియదంటూ అభ్యంతరం
ప్రధాని మోదీకి లేఖాస్త్రాలు...
దేశ రాజకీయాలను మార్చే డేటా.. కులగణన. అదే సమయంలో మోదీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది ఈ ప్రక్రియ. 2027 జనగణనలో కులాల లెక్కింపు అంశం మరోసారి రాజకీయ మంటలు రేపుతోంది. కులగణనకు కేంద్రం ఇప్పటికే గ్రీన్సిగ్నల్ ఇచ్చినా.. లెక్కించే విధానంపైనే కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ రాయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
రాహుల్ ప్రశ్న ఏంటి?
2027 జనగణనలో కులాల వివరాలను సేకరించేందుకు కేంద్రం 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని నోటిఫై చేసింది. ఇందులో కులానికి సంబంధించిన ప్రశ్న కూడా ఉంది. అయితే కులాన్ని ముందుగా రూపొందించిన జాబితా నుంచి ఎంచుకునే విధానం కాకుండా.. వ్యక్తి చెప్పిన కులాన్ని నమోదు చేసే ఓపెన్ ఎండెడ్ ఫార్మట్ను ఉపయోగించాలని నిర్ణయించారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్కు అభ్యంతరంగా మారింది.
రాహుల్ గాంధీ, ఖర్గే వాదన ప్రకారం.. దేశంలోని ఒకే కులానికి వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు, ఉపకులాల పేర్లు, స్పెల్లింగ్లు ఉండొచ్చు. వాటిని విడివిడిగా నమోదు చేస్తే ఒకే సామాజిక వర్గం అనేక కేటగిరీలుగా విడిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఫలితంగా OBC జనాభా ఎంత అన్నదానిపై ఖచ్చితమైన లెక్క రాకపోవచ్చని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
అందుకే ప్రస్తుత ప్రశ్నావళిని ఉపసంహరించుకుని.. రాజకీయ పార్టీలు, నిపుణులు, ప్రజలతో విస్తృతంగా చర్చించిన తర్వాత కొత్త ప్రశ్నావళిని రూపొందించాలని రాహుల్, ఖర్గే ప్రధాని మోదీని కోరారు.
OBC కాలమ్ ఎందుకు కీలకం?
ఇక్కడే ఈ వివాదం అసలు ప్రాధాన్యం సంతరించుకుంటోంది. భారత్లో OBCలు ఒకే కులం కాదు. వందలాది సామాజిక వర్గాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. రాష్ట్రానికో జాబితా, కేంద్రానికో జాబితా ఉండటంతో పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది.
అందుకే దేశంలో OBC జనాభా వాస్తవంగా ఎంత? ఏ రాష్ట్రంలో ఎంత? ఏ సామాజిక వర్గం వెనుకబాటుతనం ఎంత? అనే ప్రశ్నలకు సరైన సమాధానం కావాలంటే విశ్వసనీయమైన డేటా అవసరం.
అయితే ప్రస్తుత జనగణన ప్రశ్నావళిలో ప్రత్యేకంగా “OBC” అనే కాలమ్ లేదని కాంగ్రెస్ ప్రధానంగా ప్రశ్నిస్తోంది. దీంతో కులాల పేర్లను సేకరించిన తర్వాత వాటిని ఎలా వర్గీకరిస్తారు? కేంద్ర, రాష్ట్ర OBC జాబితాలతో వాటిని ఎలా అనుసంధానం చేస్తారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కులగణన ఎందుకు కీలకం?
కులగణన అంటే కేవలం జనాభా లెక్కలు కాదు. భవిష్యత్లో ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలకు ఇది కీలకమైన డేటాగా మారే అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కులాల వారీ జనాభా వివరాలు అందుబాటులో లేకపోవడంతో.. వివిధ వర్గాల జనాభా వాటాపై రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు వేర్వేరు అంచనాలు చెబుతూ వస్తున్నాయి.
ఇప్పుడు 2027 జనగణన ద్వారా కులాల వివరాలు అధికారికంగా సేకరిస్తే.. దేశ సామాజిక నిర్మాణానికి సంబంధించి ఒక భారీ డేటాబేస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ డేటా ఎవరి చేతిలో ఉంటుందన్నదే కాదు.. అది ఎలా సేకరిస్తున్నారన్నదీ అంతే ముఖ్యం.
పార్టీలకు రాజకీయ ఆయుధం...
ఇక్కడే అసలు రాజకీయ లెక్క మొదలవుతుంది. కులగణనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం ఇప్పటికే ఒక కీలక నిర్ణయం. కానీ ఇప్పుడు దాని విధానంపై కాంగ్రెస్ ప్రశ్నలు లేవనెత్తడంతో బీజేపీ ప్రభుత్వం మరోసారి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాంగ్రెస్కు ఇది కేవలం సాంకేతిక అంశం కాదు. సరైన కులగణన లేకుండా సామాజిక న్యాయం ఎలా సాధ్యం? అనే రాజకీయ ప్రశ్నను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఆ పార్టీకి దొరికింది.
రాహుల్ గాంధీ చాలా కాలంగా కులగణనను సామాజిక న్యాయంతో అనుసంధానిస్తూ వస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కూడా కులగణన కాంగ్రెస్ రాజకీయ ప్రచారంలో ప్రధాన అంశంగా నిలిచింది. ఇప్పుడు 2027 జనగణన ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలో అదే అంశాన్ని మరోసారి ముందుకు తీసుకురావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
2029 ఎన్నికలపై ప్రభావం ఉంటుందా?
2027 జనగణనలో సేకరించే కుల డేటా.. ఆ తర్వాత దేశ రాజకీయ చర్చల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా OBC జనాభాపై స్పష్టమైన డేటా వెలువడితే.. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను దానికి అనుగుణంగా మార్చుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాల్లో OBC రాజకీయాలు ఇప్పటికే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలు కూడా జనాభా, ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలపై తమదైన వాదనలు వినిపిస్తున్నాయి.
అందుకే కులగణన డేటా బయటకు వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో కొత్త సామాజిక సమీకరణాలు మొదలవుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ నుంచి ఒత్తిడి
ఈ వివాదానికి తెలంగాణ కోణం కూడా ఉంది. తెలంగాణ బీసీ కమిషన్ ఇప్పటికే 2027 జనగణనలో OBCల సరైన లెక్కింపు ఉండేలా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరింది. ఖచ్చితమైన OBC డేటా ఉంటేనే సంక్షేమ విధానాలు, వనరుల పంపిణీ, ప్రాతినిధ్యానికి సంబంధించి మెరుగైన నిర్ణయాలు తీసుకోవచ్చని కమిషన్ అభిప్రాయపడింది. అంటే ఇది కేవలం ఢిల్లీ–కాంగ్రెస్ మధ్య వివాదంగా మిగిలే అవకాశం లేదు. రాష్ట్రాల డిమాండ్లు కూడా దీనికి జతకానున్నాయి.
కేంద్రం చెబుతున్న విధానం ద్వారా దేశంలోని ప్రతి వ్యక్తి తాను ప్రకటించిన కులాన్ని నమోదు చేస్తారు. ఆ తర్వాత డిజిటల్ డేటా, ఆధునిక సాధనాల సహాయంతో కులాల సమగ్ర లెక్కను రూపొందించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే స్పష్టమైన వర్గీకరణ లేకపోతే డేటా గందరగోళంగా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఒకసారి దేశంలోని కులాల జనాభాపై అధికారిక డేటా చేతికి వస్తే.. రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, సంక్షేమ పథకాలు, వనరుల పంపిణీ వంటి అంశాలపై కొత్త డిమాండ్లు మొదలయ్యే అవకాశం ఉంది. అందుకే రాహుల్ గాంధీ వేసిన ప్రశ్నకు సమాధానం కేవలం ఒక ప్రశ్నావళి మార్పుతో ముగిసిపోదు. ఇదే ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి ఎదురవుతున్న అసలు బిగ్ క్వశ్చన్.












