రాష్ట్ర ప్రభుత్వంపై మరో ఉద్యమానికి ఉద్యోగ జేఏసీ సిద్ధపడినట్టు తెలుస్తోంది.చాలా కాలంగా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సర్కార్ ఫెయిల్ అయ్యిందని వారు ఆరోపిస్తున్నారు. అడిగినప్పుడల్లా అదిగో చేస్తాం, ఇదిగో చేస్తాం అని కేవలం ఉత్తమాటలు చెబుతున్నారని, కాలయాపన చేస్తూ తమ సమస్యలు తీర్చడం లేదని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు ఇందిరాపార్క్ వద్ద ఉద్యోగు జేఏసీ నేతలు మహాధర్నాకు పిలుపునిచ్చారు.
సీపీఎస్ రద్దు, పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టినట్టు తెలిసింది. ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాచేపట్టామని ఉద్యోగ జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ మహాధర్నా కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, నిరనన ప్రదర్శనలు చేపడతామని పేర్కొన్నారు.
పెండింగ్లో ఉన్న 6 డీఏలు, పెన్షనర్లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.10 వేల కోట్ల బకాయిలు, సీపీఎస్ రద్దు, ఈహెచ్ఎస్ పూర్తిస్థాయిలో అమలు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా జేఏసీ నేతలు డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 1వ తేదీన సీపీఎస్ ఉద్యోగ,పెన్షనర్ల నిరసన కార్యక్రమం ఉంటుందని జేఏసీ ప్రకటించింది. ఇదిలాఉండగా, ఈ నెల 29వ తేదీన తెలంగాణ పవర్ జేఏసీ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా.. నిరసన ఆలోచనను విరమించుకుని చర్చలకు రావాలని టీజీ ట్రాన్స్కో ఆహ్వానం పంపింది.కాగా, దీనిపై తెలంగాణ పవర్ జేఏసీ ఇంకా నిర్ణయం తసుకోలేదని సమాచారం.
https://x.com/TeluguScribe/status/2092824139543503346?s=20
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే మర్చిపోయిందని, ఇప్పటికే పలుమార్లు పెండింగ్ సమస్యలు, బకాయిల విడుదలపై అధికారులు, సంబంధిత శాఖ మంత్రులతో చర్చలు జరిగినా ఫలితం లేకుండాపోయిందని ఉద్యోగ జేఏసీ నేతలు మండిపడుతున్నారు.












