అయోధ్య రామమందిరం విరాళాల చోరీలో తవ్వేకొద్దీ నిజాలు వెలుగుచూస్తున్నాయి. మొత్తం వ్యహారంలో అవినాశ్ శుక్లా అనే కీలక నిందితుడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. తాజాగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. నగదు విరాళాలను లెక్కించేందుకు రూ.15 వేల జీతంతో చేరి అవినాశ్ శుక్లా.. 70 సార్లు విరాళాలు దొంగతనం చేసినట్టు అధికారులు తేల్చారు.
విరాళాల చోరీలో శుక్లాకు.. అన్కల్ప్ మిశ్ర, లవ్కుష్ మిశ్ర, కరుణేష్ పాండేలు సహకరించినట్లు సీసీటీవీ ద్వారా SIT అధికారులు గుర్తించారు. దీనికి తోడు భక్తుల నుండి దొంగతనంగా విరాళాలు సేకరించేందుకు ఫోర్జరీ చేసిన రశీదులను సైతం వీరు తయారు చేసినట్టు విచారణలో తేలింది. ఈ ఫోర్జరీ రశీదుల సాయంతో అన్కల్ప్ మిశ్ర, లవ్కుష్ మిశ్ర, కరుణేష్ పాండే, టిన్నూ యాదవ్లు విరాళాలు తీసుకున్నట్లు సిట్ విచారణలో అంగీకరించినట్టు తెలిసింది. ప్రస్తుతం దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.
ఉద్యోగులది కీ రోల్..
అయోధ్య రామమందిరంలో డబ్బులు తీసుకొని కొందరికి ఉద్యోగాలు కల్పించినట్టు తెలుస్తోంది. దీంతో ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలపై, వారి లావాదేవీలపై పోలీసులు నిఘా పెట్టారు. నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా ఇంట్లో నుంచి రామరాజ్య కోశ్ అనే పేరుతో ఉన్న విరాళాల హుండీని స్వాధీనం చేసుకున్నారు. దానిపై పేటిఎం క్యూఆర్ కోడ్ కూడా ఉండడంతో ఆన్లైన్లోనూ డబ్బు దోపిడీ కూడా జరిగినట్టు సిట్ అధికారులు గుర్తించారు.












