Wife Kills Husband: వివాహేతర సంబంధాలు, మనీ మోజు కాపురాలను కూలుస్తున్నాయి. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త వివాహేతర సంబంధాలు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తున్నారు. తమ బంధానికి అడ్డుగా ఉన్నారనే నెపంతో హత్యలకు కూడా వెనుకాడటం లేదు. వివాహేతర సంబంధాల మోజులో కొందరు భార్యలు రెచ్చిపోతున్నారు. తాళి కట్టిన భర్తనే కడతేరుస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి దారుణాలు అనేకం జరిగాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో అలాంటి హత్యోదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతోపాటు 20 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ భార్య తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపింది. ఆ తర్వాత ఈ మరణాన్ని సహజమైన పాముకాటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు కుట్రను ఛేదించారు. నిందితులైన భార్యను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
అతడి పేరు అతుల్ పన్వార్. ఆమె పేరు దామిని. 2019లో వీరికి పెళ్లైంది. హస్తినాపూర్ లో నివాసం ఉంటున్నారు. ఒక ప్లే స్కూల్ నడుపుతున్నారు. కాగా, స్కూల్ వ్యాన్ డ్రైవర్ తుషార్ అలియాస్ నిక్కీతో దామినికి వివాహేతర సంబంధం ఏర్పడింది. అతడి మోజులో పడిపోయింది. ఈ క్రమంలో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను లేపేయాలని దామిని ప్లాన్ చేసింది. మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అతుల్ ని చంపాలని చూశారు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ కావడంతో మరో భయంకరమైన స్కెచ్ వేశారు.
ప్లాన్ లో భాగంగా రాత్రి దామిని తన భర్త తాగే పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. ఆ పాలు తాగిన అతుల్ స్పృహ కోల్పోయాడు. ఇదే అదనుగా దామిని తన ప్లాన్ అమలు చేసింది. తుషార్ సాయంతో విష సర్పాన్ని తీసుకొచ్చి బెడ్పైకి వదిలి కాటు వేయించింది. ఉదయం లేచి చూసే సరికి అతుల్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
తొలుత ఇది సాధారణ పాముకాటు మరణంలా అనిపించింది. అయితే, పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. తమదైన స్టైల్ లో విచారణ చేశారు. దామిని, తుషార్ మొబైల్ ఫోన్ రికార్డులను, లొకేషన్ డేటాను నిశితంగా పరిశీలించారు. దాంతో వారిద్దరి మధ్య ఉన్న సంబంధం, హత్య జరిగిన రాత్రి వారి కదలికలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
ఈ కుట్రకు రెండు ఉద్దేశాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఒకటి, రూ. 20 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం.. రెండవది, వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి అతుల్ను తొలగించడం. అనుమానం రాకుండా ఉండేందుకు, ఈ మరణాన్ని సహజంగా జరిగిన పాముకాటు సంఘటనగా చిత్రీకరించడానికి నిందితులు ఈ పథకం పన్నారని పోలీసులు వివరించారు. తుషార్ కు ఇది వరకే పెళ్లైంది. ఆమెకు విడాకులు ఇచ్చి దామినితో కలిసి ఉండాలని అనుకున్నాడని పోలీసులు తెలిపారు.












