కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒకప్పుడు భార్యాభర్తల బంధం అంటే నమ్మకం, పరస్పర గౌరవం, త్యాగానికి ప్రతీకగా భావించేవారు. కానీ ఇటీవల వెలుగులోకి వస్తున్న నేర ఘటనలు చూస్తే.. దాంపత్య బంధంలో నమ్మకం క్రమంగా దెబ్బతింటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గురుగ్రామ్కు చెందిన ఏకం న్యాయ్ ఫౌండేషన్ విడుదల చేసిన డాక్యుమెంటేషన్ నివేదిక ప్రకారం.. 2026 జనవరి నుంచి జూన్ వరకు దేశవ్యాప్తంగా భర్తల హత్యలు, ఆత్మహత్యలకు సంబంధించిన వందలాది కేసులు పోలీసుల వద్ద నమోదైనట్లు పేర్కొంది. మీడియా కథనాలు, తమ వద్ద నమోదైన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఈ నివేదికను రూపొందించినట్లు ఫౌండేషన్ వెల్లడించింది.
ఈ నివేదికలో ఉన్న అంశాలు చర్చనీయాంశంగా మారాయి. నమోదు చేసిన కేసుల్లో గణనీయమైన సంఖ్యలో భార్యల చేతిలో భర్తలు హత్యలకు గురైనట్లు, మరికొందరు కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి, వేధింపులు, న్యాయపరమైన వివాదాలు వంటి కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా కొన్ని హత్య కేసుల్లో భార్యల వివాహేతర సంబంధాలు ప్రధాన కారణంగా ఉన్నాయని నివేదిక ఆరోపిస్తోంది.
ముఖ్యంగా 2026లో ఈ ఆరు నెలల్లోనే.. అంటే జనవరి 2026 నుంచి జూన్ 2026 వరకూ మన దేశంలో 554 మంది భర్తలు మరణించారు. గురుగ్రామ్కు చెందిన 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' అనే NGO రిపోర్ట్ బయటపెట్టింది. ఇందులో 322 మంది భర్తలు భార్యల చేతుల్లో హత్యలకు గురయ్యారని, ఇతర సమస్యలతో 232 మంది భర్తలు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పేర్కొంది.
అయితే ఈ వివరాలు ఫౌండేషన్ విశ్లేషణ ఆధారంగా ఉన్నవేనని, ప్రతి కేసులో తుది నిజాలు న్యాయస్థానాల విచారణల ద్వారానే తేలుతాయని గుర్తుంచుకోవాలి. మరోవైపు దాంపత్య బంధంలో విభేదాలు వచ్చినప్పుడు వాటిని చర్చల ద్వారా పరిష్కరించకుండా.. హింస, హత్యలు, ఆత్మహత్యల వరకు వెళ్లడం ఎందుకు పెరుగుతోంది? కుటుంబాల్లో సహనం తగ్గిపోతుందా? లేక భావోద్వేగాలను నియంత్రించే సామర్థ్యం తగ్గుతోందా? అనే ప్రశ్నలు సమాజం ముందుకు వస్తున్నాయి.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భార్య అయినా, భర్త అయినా.. మానసిక వేధింపులు, గృహ హింస, అనుమానాలు, ఆర్థిక ఒత్తిళ్లు, వివాహేతర సంబంధాలు, కమ్యూనికేషన్ లోపం వంటి అంశాలు కుటుంబాలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కౌన్సెలింగ్ నిపుణులు, న్యాయ కేంద్రాల సహాయం కుటుంబ సభ్యులు తీసుకోవడం ఎంతో అవసరం అంటున్నారు.
ఇక ఇలాంటి నివేదికలు సమాజానికి ఒక హెచ్చరికగా భావించాలి.. ఇది కేవలం మగవారి సమస్య కాదు.. కుటుంబ వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభానికి సంకేతం. భార్యలపై జరిగే నేరాలు ఎంత తీవ్రంగా పరిగణించాలో.. భర్తలపై జరిగే హింస, వేధింపులు, హత్యల ఆరోపణలను కూడా అంతే నిష్పాక్షికంగా విచారించడం అవసరం. చట్టం ముందు బాధితుడు స్త్రీనా, పురుషుడా అన్న తేడా ఉండకూడదని అంటున్నారు.
చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. వివాహం అనేది ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవంతో నిలబడే బంధం. ఆ బంధంలో సమస్యలు వస్తే చట్టబద్ధమైన మార్గాలను ఎంచుకోవాలి గానీ.. హింసకు, ప్రతీకారానికి, ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడం ఏ సమస్యకూ పరిష్కారం కాదు. సమాజం కూడా ఇలాంటి ఘటనలను సంచలనంగా కాకుండా.. కుటుంబ విలువలు, మానసిక ఆరోగ్యం, చట్టపరమైన అవగాహన కోణంలో చర్చించాల్సిన అవసరం ఉంది.












